Pragya Thakur Slams Rahul Gandhi:
యూకేలో రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు..
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. యూకేలో భారత్పై చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆమె..రాహుల్ను దేశం నుంచి తరిమేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం యూకేలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ...లోక్సభలో ప్రతిపక్ష మైక్లు ఆఫ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలంతా మండి పడుతున్నారు. పరాయి దేశంలో మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగ్యా ఠాకూర్ కూడా తీవ్రంగా స్పందించారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ భారత దేశ భక్తుడు కాలేడంటూ పరుషంగా మాట్లాడారు.
"విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి కదా. ఆయన ఎప్పటికీ భారత దేశ భక్తుడు కాలేడు. రాహుల్ గాంధీ మరోసారి ఆ వ్యాఖ్యలతో ఇది నిరూపించారు. రాహుల్..మిమ్మల్ని మేమెప్పుడూ భారత పౌరుడిగా భావించలేదు. ఎందుకంటే మీ తల్లి ఇటలీ నుంచి వచ్చారు కాబట్టి"
- ప్రగ్యా ఠాకూర్, బీజేపీ ఎంపీ
మైక్లు ఆఫ్ చేస్తున్నారన్న ఆరోపణలపైనా స్పందించారు ప్రగ్యా ఠాకూర్. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడానికి కారణం కాంగ్రెసేనని విమర్శించారు.
"పార్లమెంట్ సమావేశాలు సాఫీగా సాగితే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశముంటుంది. మేం ఎక్కువ పని చేస్తే కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుంది. ఇప్పటికే ఆ పార్టీ పతనం అంచులో ఉంది. వాళ్ల మెదళ్లు కూడా సంకుచితమవుతున్నాయి. రాహుల్..మిమ్మల్ని ఈ ప్రజలే ఎన్నుకున్నారు. మీరేమో విదేశానికి వెళ్లి మన ప్రజల పరువు తీస్తున్నారు. పార్లమెంట్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని అక్కడికెళ్లి చెబుతున్నారు. ఇంత కన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా. ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. దేశం నుంచి తరిమేయాలి. "
- ప్రగ్యా ఠాకూర్, బీజేపీ ఎంపీ
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇచ్చిన రాహుల్ మరోసారి మోదీ సర్కార్పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్ గురించి చెబుతూ తన ఫోన్లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"
అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
Also Read:
నాన్న నన్ను లైంగికంగా వేధించే వాడు, భయంతో మంచం కింద దాక్కున్నా - స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు