Priyanka Gandhi Detained Delhi Police: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు , విద్యార్థులపై పోలీసుల వైఖరికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం వీధుల్లోకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా తదితర సీనియర్ నేతల నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం ముట్టడికి గురువారం హఠాత్తుగా ధర్నా చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నివాసానికి సమీపంలో భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరసనకారులను అడ్డుకునేందుకు ముళ్లకంపలు, పలు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశాయి. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ నేతలు, యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నాయకులను , వందలాది మంది ప్రదర్శనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్లలో సమీప స్టేషన్లకు తరలించారు.
నిరసన అనంతర పరిస్థితులపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల అరాచకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మేము ప్రధాని నివాసానికి మార్చ్ నిర్వహించాము. ప్రభుత్వం ఈ విపత్తుపై ఎటువంటి బాధ్యత వహించడానికి ఇష్టపడటం లేదు, అలాగే పార్లమెంట్లో కూడా విద్యార్థుల భవిష్యత్తు, నీట్ అక్రమాలపై చర్చ జరగకుండా పారిపోతోంది అని ఆరోపించారు. దేశంలో లక్షలాది మంది యువత కలలను, భవిష్యత్తును ప్రధాని మోదీ, అమిత్ షాల జోడీ నాశనం చేస్తోందని, వారు వెంటనే ప్యాక్ అప్ చెప్పి పదవుల నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు.
ఈ నిరసనతో ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ల్యూటెన్స్ ఢిల్లీ, జంతర్ మంతర్, రైసినా రోడ్, కన్నాట్ ప్లేస్, సంసద్ మార్గ్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా మూసివేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేతలు నేరుగా ప్రధాని నివాస ముట్టడికి దిగడం జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను అధికార భారతీయ జనతా పార్టీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని, పత్రాల లీకేజీ వ్యవస్థపై కేంద్రం కఠిన సంస్కరణలు తెస్తోందని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ మాత్రం విద్యార్థుల న్యాయ పోరాటానికి మద్దతుగా ఛాత్రోం కీ గూంజ్ పేరిట దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించడంతో రాజధాని వేదికగా విద్యార్థి , రాజకీయ పోరు మరింత వేడెక్కింది.
