Prakash Raj controversial comments on Lord Rama: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో రామాయణంపై చేసిన వింత వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను విమర్శించే క్రమంలో ఆయన రామాయణాన్ని ఒక కల్పిత కథగా మలిచి చెప్పడం వివాదానికి కేంద్రబిందువైంది. శ్రీరాముడు ,లక్ష్మణుడిని ఉత్తర భారతం నుండి వచ్చిన వలస కార్మికులుగా ఆయన అభివర్ణించడంపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన తన ప్రసంగంలో రామాయణ పాత్రలను కించపరిచేలా మాట్లాడుతూ.. రాముడు, లక్ష్మణుడు దక్షిణాదిలోని ఒక తోటలోకి ప్రవేశించి అక్కడ పండ్లను దొంగతనంగా తిన్నారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో ఆ తోట యజమాని అయిన రావణుడితో వారికి గొడవ జరిగిందని, అదే రామాయణ యుద్ధానికి కారణమన్నట్లుగా ఒక కొత్త వెర్షన్ను వినిపించారు. పవిత్రంగా భావించే పురాణేతిహాసాన్ని ఇలా అపహాస్యం చేయడం వెనుక ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రకాష్ రాజ్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం రామాయణాన్ని వక్రీకరించడం క్షమించరాని నేరమని వారు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ,దక్షిణ భారత దేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, వలస కూలీల ప్రస్తావన తీసుకురావడం వెనుక దురుద్దేశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వివాదంపై స్పందిస్తూ పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో మత విశ్వాసాలను దెబ్బతీయడం సరైంది కాదని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని, చిత్ర పరిశ్రమ నుంచి ఆయనను బహిష్కరించాలనే డిమాండ్లు కూడా నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి.
మరోవైపు, ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు సభలో ఉన్నవారు నిరసన తెలపకుండా చప్పట్లు కొట్టి ప్రోత్సహించడంపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో కూడా అనేకసార్లు తన రాజకీయ, సామాజిక వ్యాఖ్యల వల్ల వివాదాల్లో నిలిచిన ప్రకాష్ రాజ్, ఈసారి నేరుగా పురాణ పురుషులను దొంగలుగా చిత్రించడం ఆయన కెరీర్పై మరియు వ్యక్తిగత ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
