Pragathi Bhavan News: పదేళ్లుగా తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్‌లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.ఇప్పటికే దీన్ని అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా పేరు మార్చారు. సామాన్యులకి కూడా ఆ ప్రజాభవన్‌లోకి ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. అందులో భాగంగా ప్రగతి భవన్‌ వద్ద మార్పులు చేర్పులు చేస్తున్నారు.


బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రగతి భవన్ అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం, నివాసంగా ఇప్పటి వరకు ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దాన్ని ప్రజాభవన్‌గా మార్చేస్తున్నారు. ఇది హైదరాబాదులోని పంజాగుట్టలో ఉంది. ఇండియాలోనే టాప్‌ ఆర్కిటెక్చర్‌ హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మించారు.


తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన విధులు నిర్వహించేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. అంత వరకు ఇక్కడ అధికారుల క్వార్టర్స్‌ ఉండేది. దాన్ని తొలగించి భవనాన్ని నిర్మించారు. దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టారు. దీన్ని 2016 నవంబరు 23న ప్రారంభించారు. నియోక్లాసికల్, పల్లాడియన్ శైలిలో భారతీయ వాస్తుశిల్పి హఫీజ్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను నిర్మించారు. ఈ భవనం బ్రిటీషు రెసిడెన్సీ, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి కట్టడాలను పోలి ఉంటుంది. 


2016 మార్చిలో ప్రగతి భవన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దీని కోసం 38కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ నిర్మాణ కాంట్రాక్టర్‌. 9 ఎకరాల ఈ ప్రగతి భవన్ నిర్మించారు. ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత పేరుతో సమావేశ మందిరం ఉన్నాయి. 


జనహిత అనేది 1000 మందికి పైగా కూర్చునే సామర్థ్యంతో కూడిన మీటింగ్‌ ఏరియా. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2017 ఫిబ్రవరి 17న దీన్ని ప్రారంభించారు. ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చేవారితో సమావేశమవుతుంటారు. ఇందులో కార్యదర్శులు, కలెక్టర్లు, అధికారిక సమీక్షా సమావేశాలు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు.  


2004లో నిర్మించిన ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని కాదని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. పాతభవనాన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఇంటెలిజెన్స్) కార్యాలయంగా ఉంది. అలాంటి భవనం రూపు రేఖలు మార్చేస్తున్నారు రేవంత్ రెడ్డి.