Aadhaar authenticated user can book Tatkal tickets : రైళ్లలో తత్కాల్ కోటా టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.  అయితే ఆ టిక్కెట్ల బుకింగ్ లో చాలా అక్రమాలు  జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. 

భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1, 2025 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు అక్రమ బుకింగ్‌లను అరికట్టడం, పారదర్శకతను పెంచడం, సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యంగా  తీసుకొొస్తున్నారు. 

జూలై 1, 2025 నుండి, IRCTC వెబ్‌సైట్ (www.irctc.co.in) ,  మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి  ఆధార్  ఓటీపీ తప్పనిసరి చేశారు.  ఆధార్‌తో లింక్ చేసిన IRCTC ఖాతాలతో మాత్రమే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.  ఈ నిబంధన ద్వారా, నిజమైన ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకూ అక్రమార్కులు  బాట్‌లు లేదా ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా బుకింగ్‌లు చేసుకుంటూ సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రాకుండా చేస్తున్నారు. 

ఆధార్ ధృవీకరించిన  ఖాతాలు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యత పొందుతాయి. ఈ సమయంలో ఏజెంట్లకు బుకింగ్ చేయడానికి అనుమతి ఉండదు.  IRCTC అధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల్లో టికెట్లు బుక్ చేయలేరు. ఏజెంట్లు AC క్లాస్‌లకు ఉదయం 10:00 నుండి 10:30 వరకు ఏజెంట్లు బుకింగ్ చేయలేరు. నాన్-AC క్లాస్‌లకు ఉదయం 11:00 నుండి 11:30 వరకు ఏజెంట్లు బుకింగ్ చేయలేరు.

బల్క్ బుకింగ్‌లను నిరోధించడం ,  సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఐఆర్‌సీటీసీ ఈ మార్పులు చేస్తోంది.  గత డేటా ప్రకారం, AC క్లాస్‌లలో 62.5% మరియు నాన్-AC క్లాస్‌లలో 66.4% తత్కాల్ టికెట్లు మొదటి 10 నిమిషాల్లోనే బుక్ అవుతున్నాయి. ఇందులో బాట్‌ల ద్వారా బుకింగ్‌లు ఉన్నట్లుగా గుర్తించారు.                

కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు , అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసే తత్కాల్ టికెట్లకు కూడా  సిస్టమ్-జనరేటెడ్ OTP ధృవీకరణ అవసరమని నిబంధనలు మార్చారు.  బుకింగ్ సమయంలో ప్రయాణికుడు అందించిన మొబైల్ నంబర్‌కు OTP  వస్తుంది. ఈ నిబంధన జూలై 15, 2025 నుండి అమలులోకి వస్తుంది. ప్రతిరోజూ సుమారు 2,25,000 ప్రయాణికులు IRCTC ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నారు.