భారత్‌, కెనడాల మధ్య ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న్ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సలీవాన్‌ గురువారం దీనిపై స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హత్య కేసులో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా చేస్తున్న ఆరోపణలపై ఉన్నతస్థాయిలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో భారత్‌కు ఎలాంటి మినహాయింపు లేదని ఆయన వెల్లడించారు. 


ఈ ఘటనపై అమెరికా ఆందోళన చెందడం ప్రక్రియకు ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా.. అమెరికా తన ప్రిన్సిపుల్స్‌ కోసం నిలబడుతుందని, ఏ దేశం ప్రభావితమైనా సరే తమ విధానాల ఆధారంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఈ అంశం తమకు ఆందోళన కలిగించే విషయమని, దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని జాక్‌ సలీవాన్‌ పేర్కొన్నారు. దీనిపై తాము పనిచేస్తునే ఉంటామని, ఏ దేశంతో సంబంధం లేకుండా తాము పనిచేస్తామని అన్నారు. ఇలాంటి విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేవని, తాము తమ దేశ ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటామని తెలిపారు. కెనడా వంటి మిత్ర దేశాలు వారి చట్ట అమలు, దౌత్య ప్రక్రియను కొనసాగిస్తున్నప్పడు మేము కూడా వారితో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. మేము కెనడా అధికారులతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే భారత్‌తో కూడా టచ్‌లో ఉన్నామని ఆయన తెలిపారు. అయితే ఈ అంశంపై కెనడా, అమెరికాల మధ్య దూరం ఉందని సూచించే నివేదికలతో తాను విభేదిస్తున్నట్లు వెల్లడించారు. కెనడా అధికారులు దర్యాప్తును కొనసాగించి, నేరస్థులను అదుపులోకి తీసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు సలీవన్‌ వెల్లడించారు.


ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మాట్లాడుతూ భారత్‌పై ఆరోపణలకు తమ వద్ద నమ్మకమైన ఆధారాలున్నాయని మరోసారి వెల్లడించారు. కెనడాలో కెనడా పౌరుడి హత్యపై భారత్‌ పాత్ర ఉందని తమకు సహకరించాలని కోరారు. తాను రెచ్చగొట్టేందుకు మాట్లాడడం లేదని దర్యాప్తుకు సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ట్రూడో ఐరాసలోని కెనడా దౌత్య బృందంతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సిం్‌ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తితలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు.  ఖలిస్థాన్ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల  నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌ కూడా కెనడా రాయబారిని బహిష్కరించి  దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.  కెనడా  పౌరులకు వీసాల జారీలను కూడా భారత ప‌్రభుత్వం నిలిపేసింది.  జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన.