Kishanreddy: ప్రస్తుతం మన దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. తక్కువ సమయంలోనే ప్రయాణం, సౌకర్యవంతమైన సీటింగ్ వ్యవస్థ, ఇతర ఫీచర్ల కారణంగా చాలా మంది ఈ రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు రాబోతున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ 15న దేశ వ్యాప్తంగా 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.  ఈ కొత్త రైళ్లు సాధారణ రైళ్ల కంటే వేగంగా.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. ఈ కొత్త రైళ్లను నిత్యం రద్దీగా ఉండే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాలకు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే రెండు రైళ్లను మాత్రం తెలుగు రాష్ట్రాలకు కేటాయించనున్నారు.  


మోదీ వినాయక చవితి కానుక
 తెలుగు ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందజేశారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ - హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్టణం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. 



వారందరికీ మోదీ పెద్దకొడుకు
దేశంలో ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. దేశంలో 70 ఏళ్లు పై వయో వృద్ధులందరినీ ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన వారందరూ ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంత తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఆయన పెద్ద కొడుకుగా మారాడని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వచ్చే రెండేళ్లలో అంటే 2024-25, 2025-26లలో కేంద్ర ప్రభుత్వం రూ. 3437 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 70 ఏళ్లు నిండిన ఆరు కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని, కేవలం పేద వారికి మాత్రమే కాకుండా మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు..


10లక్షల మందికి లబ్ధి
 కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో తెలంగాణలో  పది లక్షల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుందని కిషన్‌ రెడ్డి అన్నారు. కొత్త పథకంలో భాగంగా ఏబీ పీఎంజేఏవై(AB PMJAY) కింద 70 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ద్వారా 90 శాతం తగ్గింపు ధరతో నిత్యవసర వస్తువులు, ఉచితంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలను అందిస్తోందన్నారు.


2018లో ప్రారంభం
ఇదిలా ఉంటే దేశంలో పేదల వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రారంభించించింది. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందిస్తారు. రూ. ఐదు లక్షల వరకు అయ్యే వైద్యాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా 2011 సోషియో ఎకనామిక్‌ క్యాస్ట్‌ (SECC) ప్రకారం అర్హులైన పేదలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. అయితే తాజాగా 70 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.