Jantar Mantar Student Protest:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న  నీట్ పేపర్ లీకేజీ వివాదం , జంతర్ మంతర్ వద్ద సాగుతున్న విద్యార్థుల ఆందోళనలతో  కేంద్ర ప్రభుత్వం-కాక్రోచ్ జనతా పార్టీ  ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ముగిశాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తటస్థ వేదికగా జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొని ఆందోళనకారుల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థులు,  విద్యా రంగానికి చెందిన ప్రతినిధులు ప్రధానంగా తమ మూడు డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు ఉంచగా, అందులోని రెండు ప్రధాన విన్నపాలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

చర్చల అనంతరం సీజేపీ నాయకులు  తాము ప్రతిపాదించిన మూడు ప్రాథమిక డిమాండ్లలో రెండింటికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. నీట్ లీకేజీ అక్రమాలు ,  పరీక్షా గందరగోళం వల్ల మానసిక తీవ్ర వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. దీనితో పాటు జంతర్ మంతర్ ,  ఇతర ప్రాంతాల్లో ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు విద్యార్థులు, యువతపై నమోదు చేసిన పోలీస్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. 

అయితే, విద్యార్థుల ఉద్యమానికి అత్యంత కీలకమైన మూడో డిమాండ్ విషయంలో మాత్రం కేంద్రం మౌనం దాల్చింది. విద్యావ్యవస్థలో పారదర్శకత లోపించడం ,  వరుస పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీజేపీ స్పష్టం చేసింది.  ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేవరకు లేదా ప్రభుత్వం ఆయనను తొలగించే వరకు ఈ ఆందోళనలు ఆగే ప్రసక్తి లేదు  అని సీజేపీ నేతలు తేల్చిచెప్పారు. కేంద్రం ముందుకు తెచ్చిన ఇతర ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ చర్చల ప్రక్రియ ఇక్కడితో ముగిసిపోలేదని, రేపు  మరోసారి  కేంద్ర ప్రభుత్వ మంత్రుల బృందంతో ద్వితీయ విడత చర్చలు జరపనున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి తీవ్రమైన అంశాల్లో నామమాత్రపు హామీలు కాకుండా, విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఒకవైపు ఢిల్లీ వీధుల్లో వేలాది మంది జెన్-జీ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతుండగా, మరోవైపు ఈ భేటీ ద్వారా కేంద్రం కూడా సయోధ్యకు దిగిరావడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.   

కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ వివాదానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌పై పట్టుపట్టడం ప్రభుత్వానికి సంక్లిష్టంగా మారింది. శనివారం జరగబోయే తదుపరి రౌండ్ చర్చల ఫలితాన్ని బట్టి విద్యార్థుల పోరాటం తీవ్రరూపం దాల్చుతుందా లేదా ఉపశమనం పొందుతుందా అనేది తేలనుంది. సీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ నిరసనల నెట్‌వర్క్‌ను మరింత విస్తరింపజేస్తామని హెచ్చరిస్తోంది.