Kavitha In Mumbai :  మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.  తెలంగాణలో జరుగుతున్న పనులు మహారాష్ట్రలో ఎందుకు జరగలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ఆమె మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో కవితకు స్వాగతం పలికారు.   మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుడు తో కార్యక్రమ వేదిక మార్మోగింది.


బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ విస్తరిస్తాం !                    


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.  ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుందని తెలిపారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని, తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి తెలంగాణలో చేస్తున్న పనులను చేయాలని అక్కడి ప్రజల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రజలు అనేక విజ్ఞప్తులు చేశారని గుర్తు చేశారు. 


మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం                   


దేశంలో ఇప్పటివరకు విద్యుత్తు తాగునీరు సాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరు కల్పించలేదని, కానీ తెలంగాణలో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామని తెలిపారు.  కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రమే ఇంత చేస్తే దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని అన్నారు. ఈ ప్రజల ఎజెండానే ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధి లో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ప్రకటన చేశారు. శివాజీ , అంబేడ్కర్ తో పాటు అనేక మంది మహానుభావుల స్ఫూర్తితో తాము ప్రజల కోసం పని చేస్తామని అన్నారు.


హైదరాబాద్‌లో 24 గంటల తాగునీరు... ముంబైలో రెండు గంటలే  !                           


ముంబై పట్టణంలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచినీరు సరఫరా అవుతుందని, హైదరాబాదులో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని ప్రశ్నించారు.ముంబై వచ్చినందున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న శరద్ పవార్,  ఉద్ధవ్ ఠాక్రే వంటి నాయకులను కలుస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై కవిత స్పష్టతనివ్వలేదు. శరద్ పవార్‌తో  కెసిఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన ఎంతగానో తోడ్పడ్డారని తెలిపారు