సీఎంగా షిండే...ఎవరూ ఊహించని ట్విస్ట్..


మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సీఎం సీటు దక్కించుకున్నారు ఏక్‌నాథ్ షిండే. అసలైన శివసేన ఇదేనని ప్రచారం చేసుకుంటున్నారు. భాజపా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఊహించినా అనుకోకుండా చివర్లో ట్విస్ట్ ఇచ్చింది కాషాయ పార్టీ. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఫడణవీస్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోవా వెళ్లారు షిండే. తనకు మద్దతు తెలిపిన వారందరితోనూ సమావేశమయ్యారు. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలిరోజే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బాలాసాబెబ్ థాక్రే సిద్ధాంతాలు నమ్మే శివసైనిక్‌" ముఖ్యమంత్రి 
అవటం పట్ల మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన ఆ 50 మంది ఎమ్మెల్యేల వల్లే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు. 
 
షిండే కూడా ఊహించి ఉండడు: శరద్ పవార్


ఈ పరిణామాలు జరుగుతుండగానే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం చేయటాన్ని దేవేంద్ర ఫడణవీస్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. "నెంబర్ 2 పొజిషన్‌లో ఉండటం ఫడణవీస్‌కు ఇష్టం లేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత అసంతృప్తితో ఉన్నారో" అంటూ కామెంట్ చేశారు పవార్. ఫడణవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పని చేశారని, అధిష్ఠానం ఎలా చేయమంటే అలా చేయటం ఆయన పని అని వ్యాఖ్యానించారు. "ఇది నిజంగా సర్‌ప్రైజ్. నాకు తెలిసి రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ లీడర్ సీఎం అవుతారని ఊహించి ఉండరు. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే..ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగాపని చేసిన ఫడణవీస్‌కు డిప్యుటీ సీఎం ఇవ్వటం" అని అన్నారు శరద్ పవార్. 


బాలాసాహెబ్ బాటలోనే..


అటు మాజీ ముఖ్యంత్రి ఉద్దవ్ థాక్రే కూడా కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. "కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న ఏక్‌నాథ్ షిండేకి, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు అభినందనలు. మహారాష్ట్రకు మంచి చేస్తారని ఆశిస్తున్నాను" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక సీఎం ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి రోజునే అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నుకోనున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఏవైతే ఆశించారో, ఆ పనులన్నింటినీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే షిండే ప్రకటించారు. బాలాసాహెబ్ థాక్రే విజన్‌కు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు షిండే. అందరితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని దాట వేస్తున్నారు.