Rains In Andhra Pradesh And Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది.  ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు పడొచ్చని చెబుతోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందని అంచానా వేస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. ఈ వాతావరణం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో జోరు వానలు దంచి కొడుతున్నాయి. 


బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం మీదుగా ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారబోతోందని కూడా చెబుతున్నారు. ఇది ఒకట్రెండు రోజుల్లో తుపానుగా కూడా మారొచ్చని చెబుతున్నారు. తుపానుగా మారితే మాత్రం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలపై ప్రభావం ఉంటుంది. వాతావరణ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు ఖాయంగా కనిపిస్తుంది. ఎక్కువ వర్షాలు రాయలసీమలో ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Today's Weather In Andhra Pradesh )
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. ఓవైపు తుపాను పరిస్థితులు, మరోవైపు ఈశాన్య రుతుపవనాల రాకతో వర్షాలు పడతాయి. వీటన్నింటి కారణంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చి­త్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, విశాఖ, అనకా­పల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి. 


అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలు 


మంగళవారానికి చాలా ప్రాంతాల్లో వాతావరణం మారిపోనుంది. మేఘావృతమై వర్షాలు జోరు అందుకోనున్నాయి. కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యా­ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 
పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని బుధవారం భారీ వర్షాలు కురుస్తయి. ఉత్తరాంధ్రలో మాత్రం గోదావరి జిల్లాల్లో సీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు కంట్రోలు రూమ్, హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 


తెలంగాణలోని వాతావరణం(Today's Weather In Telangana )
తెలంగాణలో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే ఏ జిల్లాకు ప్రత్యేకమైన అలర్ట్ ఏమీ లేదని స్పష్టం చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు జోరుగా ఉంటాయని మాత్రం వెల్లడించింది. 
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల వరకు నమోదు కావచ్చని తెలిపింది. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత నిజమాబాద్‌లో 34.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదు అయింది. 


తమిళనాడులో వానలు, చెన్నైలో మేఘావృతం(Weather In Chennai and Tamil Nadu)


తంజావూరు, తిరువారూర్, మధురై, విరుదునగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, సేలం, ధర్మపురి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.  చెనైలో రాబోయే 24 గంటలపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-34°C, కనిష్ట ఉష్ణోగ్రత 27-28°C నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.