Kurnool Crime News: తోడి కోడళ్లు ఇద్దరూ కలిసి పశువుల కోసం పచ్చగడ్డి తెచ్చేందుకని వెళ్లారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గడ్డి కోస్తున్నారు. కానీ ఇందులోనే వారి వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వారి గొంతు కోశారు. ఆపై తలపై రాళ్లతో బాది దారుణంగా హత్య చేశారు. ర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన పెద్దరామ గోవిందు, చిన్నరామ గోవిందులు అన్నదమ్మలు. అయితే వీరికి 21 ఏళ్ల రేణుక, 26 ఏళ్ల రామేశ్వలితో గతంలోనే పెళ్లిళ్లు అయ్యాయి. వీరంతా ఒకేచోట కలిసి ఉంటారు. వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.


తోడి కోడళ్లు ఇద్దరూ పశువులుకు మేత తెచ్చేందుకు స్థానికంగా ఉన్న పొలాలకు వెళ్లారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గడ్డి కోసుకుంటున్నారు. అదే సమయంలో వచ్చి కొందరు దుండగులు గడ్డి కోస్తున్న తోడికోడళ్ల గొంతులు కోసేశారు. ఆపై రాళ్లతో వారి తలలు పగులగొట్టి హత్య చేశారు. వాళ్లు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. గడ్డి కోసం వెళ్లిన రేణుక, రామేశ్వరి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. సాయంత్రం ఆరు గంటలకు అన్నదమ్ములిద్దరూ వారిని వెతుక్కుంటూ వెళ్లారు. 


స్థానికంగా ఉన్న పొలం వద్దకు వెళ్లగా.. తోడి కోడళ్లు ఇద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. తమ భార్యలు చనిపోవడం చూసిన పెద్దరామ గోవిందు, చిన్న రామగోవిందు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులతోపాటు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులతో పాటు గ్రామస్థులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు.


సొంత అక్కాచెల్లెల్లలాగా కలిసి ఉన్న తోడి కోడళ్లు ఒకేసారి హత్యకు గురి కావడం చూసి గ్రామస్థులంతా కంటతడి పెట్టారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే దిశ డీఎస్పీ వెంకట రామయ్య, కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సై మల్లికార్జునలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రేణుక, రామేశ్వరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


కట్టుకున్నభార్యనే హత్య చేసిన భర్త..


ఇటీవలే బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే భార్యను కడతేర్చాడు. నిజాంపట్నం మండలం ఆముదాలపల్లిలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యను భర్త కత్తితో పీక‌ కోసి హత్య చేయడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. నాగరాజు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై  భార్య రమాదేవిని వేధించండం, దాడి చేయడం నిత్యకృత్యంగా మారింది. వేధింపులు భరించలేక తన పుట్టింటికి వెళ్లింది రమాదేవి. ప్రతిరోజు మద్యం తాగి భార్య పుట్టింటి వద్దకు వెళ్లి తాగాదాలాడటం ఇంటికి రావాలని లేకపోతే చంపేస్తానని బెదిరించడం చేసేవాడు. శనివారం మధ్వాహ్నం ఫూటుగా తాగిన నాగరాజు భార్య ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో రమాదేవి  నిద్రపోతుంది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు మద్యమత్తులో ఉన్న నాగరాజు నిద్రిస్తున్న రమాదేవిపై కత్తితో దాడి చేసి గొంతు కోయడంతో ఆమె అక్కడక్కడే  మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు విలపించడం అక్కడ ఉన్న  ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. హత్య చేసిన అనంతరం నిందితుడు నాగరాజు పోలీసులకు లొంగి పోయాడు.