Kodali Nani Reaction on Chandrababu Comments: నేడు గుడివాడలో టీడీపీ వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళారంటూ ఎద్దేవా చేశారు. సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు, నీటి అవసరాలకు 600 ఎకరాల భూసేకరణ చేశారని గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే తాను రాజకీయాలను వదిలేస్తానని అన్నారు. నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. చావటానికైనా సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడబోనని అన్నారు. రా.. కదలి రా.. సభలో గురువారం రాత్రి (జనవరి 18) చంద్రబాబు సీఎం జగన్, తనపై చేసిన విమర్శలకు ఇప్పుడు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.


‘‘గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణలో భూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. రా.. కదలి రా.. సభకు 5 వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుంచి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు.


వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల కోసం పునాదులు వేసి చంద్రబాబు వదిలేశాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి.. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75 ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా’’ అని కొడాలి నాని ప్రశ్నించారు.