Rahul Kisses sister in public : భారతీయ జనతా పార్టీ  సీనియర్ నేత కైలాష్ విజయ్‌వర్గీయ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో  కైలాష్ విజయ్‌వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ, విపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజుల్లో విపక్ష నేత సోదరిని పబ్లిక్‌లో ముద్దుపెట్టుకుంటున్నాడు.  ఇది విదేశీ సంస్కృతి ప్రభావం. మన సంప్రదాయంలో సోదరి ఇంటికి వెళ్లినా నీరు తాగరు" అంటూ విజయ్‌వర్గీయ చెప్పిన మాటలు దుమారాన్నిరేపాయి. 

కాంగ్రెస్ కార్యకర్తలు   మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో   విజయ్‌వర్గీయ దిష్టిబొమ్మలను  కాల్చి, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాపులారిటీని  చూసి తట్టుకోలేక  చేసినవని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.   విజయ్‌వర్గీయ వ్యాఖ్యలు తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్, ఇండోర్, భోపాల్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. విజయ్‌వర్గీయ  దిష్టిబొమ్మలను కాల్చి, 'విజయ్‌వర్గీయ మూర్ఖుడు', 'మహిళల అవమానకర వ్యాఖ్యలు' అంటూ నినాదాలు చేశారు. విజయ్‌వర్గీయ  మహిళల దుస్తులపై కూడా ఇటీవల వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది.  

కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు కూడా ఈ వ్యాఖ్యలను 'స్త్రీ ద్వేషం'గా పేర్కొంటూ ఖండించారు.  బీజేపీ వర్గాలు ఇప్పటివరకు విజయ్‌వర్గీయ వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లు మౌనంగా ఉన్నారు. బీజేపీ నేతలు అది విజయవర్గీయ "ఇది పర్సనల్ ఒపీనియన్" అని చెబుతున్నారు. . గతంలో 2023లో యూపీ మంత్రి దీనేష్ ప్రతాప్ సింగ్, రాహుల్-ప్రియాంక సోదర స్నేహాన్ని 'పాండవులు కిస్ చేస్తారా?' అని విమర్శించినప్పుడు కూడా ఇలాంటి వివాదం జరిగింది.  

ఈ వివాదంపై విజయవర్గీయ స్పందించారు. తాను సోదర బంధం  పవిత్రతను ప్రశ్నించడం లేదు. అన్ని సంబంధాలు పవిత్రమైనవి... అయితే, ఒక పరిమితి ఉంది, నేను దానినే ప్రస్తావిస్తున్నాను. నేను చెప్పినది ఏమిటంటే ఇది విదేశాలలో జరుగుతుంది, కానీ ఇక్కడ ఇలా జరగదు... మీరు నా మొత్తం ప్రసంగాన్ని విన్నట్లయితే, ఈ ప్రశ్న తలెత్తేది కాదు. నేను విదేశీ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి మాత్రమే మాట్లాడాను..అని వివరణ ఇచ్చారు.  

బీజేపీ నేతలకు మహిళలపై గౌరవం లేదని.. మహిళల్ని ఎప్పుడూ కించ పరుస్తూ ఉంటారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వివాదం ఎటు తిరుగుతుందోనని మధ్యప్రదేశ్ బీజేపీ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.