Pinarayi Vijayan`ED Raids: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం హైడ్రామా నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఘటనతో తిరువనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. బుధవారం తెల్లవారుజాము నుంచే తిరువనంతపురంలోని ఆయన అద్దె నివాసం, కన్నూర్లోని సొంత ఇల్లు సహా రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ దాడులు జరగడం కేరళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
విజయన్ కుమార్తెపై ఆరోపణలే కారణం
ఈ సోదాలకు ప్రధాన కారణం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ నడిపిన ఎక్సలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు, CMRL సంస్థకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు. ఎలాంటి సేవలు అందించకుండానే వీణా సంస్థకు CMRL సుమారు రూ. 1.72 కోట్లు చెల్లించిందని ఆదాయపు పన్ను శాఖ మ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ గతంలోనే నివేదించాయి. దీనిపై మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తున్న ఈడీ, తాజాగా విజయన్ , ఆయన అల్లుడు మొహమ్మద్ రియాస్ నివాసాల్లో కీలక పత్రాల కోసం సోదాలు చేపట్టింది.
అట్టుడికిన తిరువనంతపురం
ఈడీ దాడుల వార్త తెలియగానే తిరువనంతపురంలోని విజయన్ నివాసం వద్దకు భారీగా సీపీఎం కార్యకర్తలు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సోదాలు ముగించుకుని బయటకు వస్తున్న ఈడీ అధికారుల వాహనంపై కార్యకర్తలు దాడికి దిగారు. వాహనంపై రాళ్లు, హెల్మెట్లు విసరడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అక్కడ మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి.
రాజకీయ కక్షసాధింపే: సీపీఎం
ఈ దాడులను సీపీఎం తీవ్రంగా ఖండించింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం తన దర్యాప్తు సంస్థలను ఆయుధాలు గా వాడుకుంటోందని ఆరోపించింది. రాజకీయంగా విజయన్ను ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని పార్టీ జనరల్ సెక్రటరీ ఎం.ఏ. బేబీ విమర్శించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దాడులతో తమకు సంబంధం లేదని, హోం శాఖకు ముందస్తు సమాచారం లేదని స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు ఈ కేసులో దర్యాప్తును ఆపలేమని స్పష్టం చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. పినరయి విజయన్ , ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న ఈ ఆరోపణలు రాబోయే రాజకీయ పరిణామాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. కేంద్ర ఏజెన్సీల దూకుడుతో ఎల్డీఎఫ్ శ్రేణులు ఆందోళనలో ఉండగా, ప్రతిపక్షాలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొంటున్నాయి.
