Kerala Robotic Elephant:


రోబో ఏనుగు..


దేవాలయ ఉత్సవాల్లో ఏనుగులదే కీలక పాత్ర. వీటిపైనే ఊరేగింపులు  ఉంటాయి. ముఖ్యంగా కేరళలోని ఆలయాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ప్రత్యేకంగా వాటికి శిక్షణనిస్తారు. అయితే...వేడుకల పేరుతో మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని నలుగురు యువకులు రోబో ఏనుగుని (robotic elephant) తయారు చేశారు. కేరళలోని ఆలయాల్లో భక్తులకు ఏనుగులు తొండంతో ఆశీర్వదిస్తాయి. అక్కడ ఇదో ఆచారం. ఇందుకోసం వాటికి చాలా ట్రైనింగ్ ఇస్తారు. వాటిని ఇబ్బంది పెట్టే బదులు రోబో ఏనుగుని తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనతో నలుగురు దీన్ని రూపొందించారు. చూడటానికి అచ్చం నిజం ఏనుగులానే ఉండేలా తీర్చి దిద్దారు. ఇది రోబో ఏనుగు అని చెబితే కానీ గుర్తించలేని విధంగా అద్భుతంగా తయారు చేశారు. 11 అడుగులు పొడవుతో, 800 కిలోల బరువుతో దీన్ని రూపొందించారు. ఐరన్‌ ఫ్రేమ్, రబ్బర్ కోటింగ్‌ వినియోగించారు. త్రిశూర్‌లోని ఇరింజదప్పిల్లీ శ్రీకృష్ణ ఆలయానికి దీన్ని డొనేట్ చేశారు. పెటా సమక్షంలో ఆలయానికి విరాళంగా ఇచ్చారు. సినీ నటి పార్వతి తిరువోతు చేతుల మీదుగా ఈ ఏనుగుని అందజేశారు. ఇంతకు దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చైందో తెలుసా..? అక్షరాల రూ.5 లక్షలు. అప్పుడే దీనికి "Irinjadappilly Raman" అని పేరు కూడా పెట్టారు. నిజమైన ఏనుగులు ఎలా అయితే ఆశీర్వదిస్తాయో..అదే విధంగా ఈ రోబోటిక్ ఏనుగు భక్తులకు ఆశీర్వాదం అందిస్తోంది. 5 పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్స్‌తో ఈ ఎలిఫెంట్ మోడల్‌ను రూపొందించారు. 










ఈ ఏనుగుపై ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. స్విచ్ సాయంతో ఏనుగు తొండాన్ని ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు ఏనుగు విగ్రహాలు తయారు చేసి పంపే బృందమే ఈ రోబోటిక్ ఏనుగుని తయారు చేసింది. దీనిపై ఆలయ అర్చకులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని ఆలయాల్లోనూ నిజమైన ఏనుగులకు బదులుగా ఈ రోబో ఏనుగులను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఏనుగులు వేడుకలు జరిగినప్పుడు ఉన్నట్టుండి భక్తులపై దాడి చేస్తున్నాయని, రోబో ఏనుగులతో ఆ బాధలు తప్పుతాయని అంటున్నారు. పెటా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. వీలైనంత వరకూ ఆలయాల్లో రోబో ఏనుగులను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది.