Karnataka Politics Today: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని గంటలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మే 28 గురువారం తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా జోరుగా సాగుతోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన తరుణంలో, నాయకత్వ మార్పు అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం 11 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి.
హైకమాండ్ ఢిల్లీ వ్యూహం
గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిగిన వరుస భేటీల తర్వాతే ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి పంపాలని, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా నిలబెట్టాలని హైకమాండ్ ప్రతిపాదించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఓబీ ముఖచిత్రంగా సిద్ధరామయ్యను ప్రొజెక్ట్ చేయాలనేది రాహుల్ గాంధీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఎప్పటి నుంచో సీఎం పీఠం కోసం వేచి చూస్తుండటంతో, ఇప్పుడు ఆయనకు మార్గం సుగమమైంది. అయితే సిద్ధరామయ్య శివకుమార్ సీఎంగా వద్దని అంటున్నట్లుగా చెబుతున్నారు. సమీకరణాలు కుదరకపోతే ఖర్గే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గురువారం ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్
రాజీనామాకు ముందు సిద్ధరామయ్య తన నివాసంలో మంత్రివర్గ సహచరులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ఆయన తన నిర్ణయాన్ని మంత్రులకు అధికారికంగా తెలిపి, వారందరికీ కృతజ్ఞతలు చెప్పనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నేరుగా రాజ్భవన్కు వెళ్లి రాజీనామా సమర్పించనున్నారు. ఈ పరిణామాలతో కర్ణాటక ఏఐసీసీ ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా కూడా బెంగళూరుకు చేరుకోనున్నారు.
డీకేఎస్ సిద్ధం.. యతీంద్రకు ఛాన్స్?
రాష్ట్రంలో పట్టున్న ట్రబుల్ షూటర్ డి.కె. శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, సిద్ధరామయ్య తన రాజీనామాకు బదులుగా తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కొత్త క్యాబినెట్లో కీలక మంత్రి పదవి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ సీఎం అయితే, అహిందా వర్గాల మద్దతు తగ్గకుండా ఉండటానికి సిద్ధరామయ్య వర్గానికి సముచిత స్థానం కల్పించడం హైకమాండ్కు అనివార్యంగా మారింది.
విపక్షాల విమర్శలు
ఈ పరిణామాలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. కర్ణాటకలో పాలన కుంటుపడిందని, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వల్లే రాష్ట్రం నష్టపోతోందని బీజేపీ విమర్శిస్తోంది. సీఎం ఎవరైనా సరే, ఈ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదని, ముందస్తు ఎన్నికలు తప్పవని అంటున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.
