OMR Sheet Number Question Paper Match: కర్ణాటక పోలీస్ శాఖలో 1,453 సివిల్ పోలీస్ కాన్‌స్టేబుల్  పోస్టుల భర్తీకి సంబంధించి కర్ణాటక పరీక్షల అధికార సంస్థ  ఆదివారం  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రాతపరీక్ష తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక చిన్న తప్పుడు ప్రచారం పరీక్షా కేంద్రాల వద్ద గందరగోళాన్ని సృష్టించగా, పలుచోట్ల అభ్యర్థులు పరీక్షను బహిష్కరించి ఆందోళనలకు దిగే వరకు పరిస్థితి వెళ్లింది. విజయపుర జిల్లా తీకోటా శారదాంబ పీయూ కాలేజీ కేంద్రంలో అభ్యర్థులు ఏకంగా వాకౌట్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో సంచలనంగా మారింది.

Continues below advertisement

అసలు వివాదానికి ప్రధాన కారణం OMR షీట్ నంబర్ ,  ప్రశ్నాపత్రం  నంబర్లు ఒకేలా ఉండాలంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఒక ఫేక్ న్యూస్. శారదాంబ కాలేజీ సెంటర్‌లో పరీక్ష రాయడానికి కూర్చున్న అభ్యర్థులు తమ OMR నంబర్, క్వశ్చన్ పేపర్ నంబర్ వేర్వేరుగా ఉండటాన్ని గమనించి ప్రశ్నించారు. సమాచారం లేకపోవడం, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నిజమని నమ్మిన యువ అభ్యర్థులు   పేపర్ లీక్ లేదా దొంగ మార్గాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఉపాధి అవకాశాల కోసం సుదీర్ఘకాలంగా సిద్ధమవుతున్న ఈ తరం యువతలో వ్యవస్థలపై ఉన్న అపనమ్మకం ఈ ఆందోళన రూపంలో బయటపడింది.

సామాజిక మాధ్యమాల్లో నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యే వార్తలను నిజానిజాలు పరిశీలించకుండానే నమ్మే  ఉద్యోగార్థుల ఆందోళన మనస్తత్వం ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది. రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తరచూ జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీల వార్తల తో తీవ్ర భావోద్వేగానికి గురైన అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్షా కేంద్రం బయటకు వచ్చి కేకలు వేస్తూ వాకౌట్ చేయడంతో పోలీసులు, పరీక్షల అధికారులు రంగంలోకి దిగి వారిని శాంతింపజేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Continues below advertisement

ఈ వివాదం ముదరడంతో కర్ణాటక పరీక్షల అధికార సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  స్పందిస్తూ అధికారిక స్పష్టత ఇచ్చారు. అధికారిక నోటిఫికేషన్‌లోగానీ, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌లోగానీ లేదా ఇన్విజిలేటర్ల మౌఖిక సూచనల్లోగానీ ఎక్కడా OMR నంబర్ ,  క్వశ్చన్ పేపర్ నంబర్ ఒకేలా ఉండాలని పేర్కొనలేదని కేఈఏ స్పష్టం చేసింది. OMR జవాబు పత్రంలో కేవలం క్వశ్చన్ పేపర్ సిరీస్ కోడ్, వెర్షన్ కోడ్ మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుందని, నంబర్లు మ్యాచ్ కావాలనే నిబంధనే లేదని తేల్చిచెప్పారు.   

సామాజిక మాధ్యమాల్లో నిరూపణ లేని వాస్తవాలను, అసత్య ప్రచారాలను నమ్మి అభ్యర్థులు తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, ఇటువంటి గందరగోళ వార్తలను వ్యాప్తి చేయవద్దని కేఈఏ ప్రజలను, నిరుద్యోగ యువతను కోరింది. సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా వాడకంలో ముందుండే జెన్ జీ యువత ఇటువంటి సున్నితమైన రిక్రూట్‌మెంట్ విషయాల్లో అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని, అనవసరపు పుకార్లకు లొంగి సన్నద్ధమైన పరీక్షలను పక్కనపెట్టడం సరైంది కాదని అంటున్నారు.