Laxman Savadi Resigns:


లక్ష్మణ్ సవది రాజీనామా


కర్ణాటకలో తొలి అభ్యర్థుల జాబితాను  విడుదల చేసింది బీజేపీ. దీనిపై ఇప్పటికే సెగ మొదలైంది. టికెట్‌ ఎక్స్‌పెక్ట్ చేసిన కొందరు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత, మంత్రి లక్ష్మణ్ సవది పార్టీని వీడారు. తనకు టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన లక్ష్మణ్...బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన ఒక్కరే కాదు. మరి కొంత మంది కూడా అసంతృప్తి నేతలున్నారని, వాళ్లు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడైన లక్ష్మణ్ సవది పార్టీ నుంచి వెళ్లిపోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. లింగాయత్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన జనసమీకరణలోనూ ఆరితేరారు. అలాంటి వ్యక్తిం పార్టీ వీడడం వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశముంది. 2012లో అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. ఆ తరవాత 2018లో లక్ష్మణ్ కాంగ్రెస్‌ అభ్యర్థిపై పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజులకే కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్ ప్రభుత్వం కూలిపోయింది. చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం లక్ష్మణ్‌ను అసహనానికి గురి చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ పేరు కూడా బీజేపీ లిస్ట్‌లో లేదు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మంతనాలు జరుపుతున్నారు జగదీష్. కానీ...అధిష్ఠానం మాత్రం టికెట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


నిజానికి..ఈ లిస్ట్ ప్రకటించక ముందే బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నాటు నాటు స్టెప్పులతో ప్రచారాలు, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు హామీలు ఇలా పార్టీలు ప్రచార స్పీడ్ పెంచాయి. అయితే అభ్యర్థుల కసరత్తు పార్టీలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. దాదాపు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో 189 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.  కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. 


షిగ్గాం నుంచి సీఎం బొమ్మై పోటీ 


భారతీయ జనతా పార్టీ మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 189 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగ్లూరు స్థానానికి పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు మూడు రోజుల చర్చల అనంతరం తొలి జాబితా విడుదల అయింది.  


Also Read: Twitter: బ్రేక్‌-ఈవెన్‌ స్థితికి చేరుకున్న బుల్లి పిట్ట, పెరిగిన కంపెనీ ఆదాయం