Tadipatri News In Telugu: అనంతపురం జిల్లా తాడిపత్రి చౌక ధాన్యపు గోదాములో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు దాడుల్లో సుమారు 2.79 కోట్ల రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు గుర్తించారు. గోదామును సీజ్ చేసి తాడిపత్రి తహసీల్దార్ కు విజిలెన్స్ అధికారులు అప్పగించారు.


తాడిపత్రి చౌక ధాన్యపు గోదాములో భారీ అవకతవకలు జరిగినట్లు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్డ్ కు ఫిర్యాదు రావడంతో విజిలెన్స్ అధికారుల తనిఖీకి ఆదేశించారు. గోదాం ఇంచార్జ్ తనిఖీ అధికారులకు సహకరించుకపోవడంతో గోదాం తాళాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిన అధికారులకు విస్తీ పోయే నిజాలు బహిర్గతం అయ్యాయి. విజిలెన్స్ అధికారులు గత మూడు రోజుల నుంచి తాడిపత్రిలో స్టాక్ పాయింట్లు తనిఖీలు నిర్వహించారు. స్టాక్ పాయింట్ లో ఉన్న రిజిస్టర్ గోదాములో నిల్వ ఉన్న సరుకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గోదాము ఇంచార్జ్  గిరిధర్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలలో సుమారు 3 కోట్ల విలువైన బియ్యము, చక్కెర, కంది బేడలు, గోధుమపిండి, రాగులు తదితర నిత్యవసర సరుకులు స్టాక్ రిజిస్టర్ లో నమోదైన గోదాములో నిలువ లేవని గుర్తించారు. విజిలెన్స్ అధికారులు గోదామును సీజ్ చేసి తాడిపత్రి ఎమ్మార్వోకు అప్పగించారు. 


మూడు కోట్ల స్కాంలో తాడిపత్రి ఎమ్మెల్యే హస్తం : జేసీ ప్రభాకర్ రెడ్డి 
చౌక ధాన్యం గోదాములో  3కోట్ల రూపాయల సరుకులు మాయమవడంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హస్తముందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సరుకులు మాయమవడం వెనక కాంట్రాక్టర్ జాన్సన్, ఎమ్మెల్యే పెద్దారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. వారిద్దరూ కలిసి స్టాక్ పాయింట్ ఇంచార్జ్ గిరిధర్ కు మద్యం ఇప్పించి సరుకులు మాయం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చౌక ధాన్యపు డిపోలో అతి పెద్ద స్కాం ఆని అభివర్ణించారు. చౌక ధాన్యపు గోదాములో బియ్యం సంచులు మార్చడం, వాటిని వాహనంలో తరలించడం వంటివి సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయిందని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత పెద్ద స్కాంను బయటపెట్టిన విజిలెన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపైన ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.