Women Auto Drivers in India: నేటి కార్పొరేట్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అందరికీ అదో కల. మేనేజర్ స్థాయి హోదా, మంచి జీతం అంటే ఆ వ్యక్తి లైఫ్ సెటిల్ అయిపోయిందని సమాజం భావిస్తుంది. కానీ, ఆ హోదా ఇచ్చే విపరీతమైన ఒత్తిడి, మానసిక టెన్షన్ల కంటే మనశ్శాంతి మిన్న అని భావించిన ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 9 ఏళ్ల ఐటీ మేనేజర్ వృత్తిని వదిలేసి ఆటో స్టీరింగ్ పట్టిన ఆమె ప్రయాణం నిజంగా అద్భుతం.

Continues below advertisement

 అసలేం జరిగిందంటే? 

డాక్టర్ నెజ్రిన్ మిద్లాజ్ అనే పారిశ్రామికవేత్త ఇటీవల ఒక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ డ్రైవర్‌తో సాధారణంగా సంభాషణ మొదలుపెట్టారు. ఆటో నడుపుతున్నది ఒక మహిళ కావడంతో, ఆమె ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటపడిన నెజ్రిన్ ఆమె గతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ డ్రైవర్ చెప్పిన సమాధానం విని నెజ్రిన్ ఆశ్చర్యపోయారు. తాను దాదాపు దశాబ్ద కాలం పాటు ఐటీ రంగంలో మేనేజర్‌గా పనిచేశానని ఆ మహిళా డ్రైవర్ వెల్లడించారు.

Continues below advertisement

 ఒత్తిడి వద్దు.. ప్రశాంతతే ముద్దు! 

పెద్ద కంపెనీలో హోదా ఉన్నప్పటికీ, నిరంతరం డెడ్ లైన్లు, మేనేజ్‌మెంట్ ఒత్తిడి, మానసిక ఆందోళన తన జీవితాన్ని మింగేస్తున్నాయని ఆమె గుర్తించారు. అందుకే ఆ విలాసవంతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతంగా ఆటో కొనుక్కుని డ్రైవర్‌గా మారారు. ప్రస్తుతం ఆమె నెలకు సుమారు రూ. 60,000 వరకు సంపాదిస్తున్నారు.  ఐటీ మేనేజర్‌గా ఉన్నప్పటి కంటే ఇప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పనికి నేనే బాస్‌ని.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు  అని ఆమె నవ్వుతూ చెప్పడం విశేషం.

 విజయానికి కొత్త నిర్వచనం  

ఈ విషయాన్ని నెజ్రిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,  ప్రతి విజయగాథ ఒకేలా ఉండదు. పేరు ప్రతిష్టల కంటే ప్రశాంతతను ఎంచుకోవడం కూడా ఒక గొప్ప విజయమే  అని రాసుకొచ్చారు. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాల కంటే మనసుకు నచ్చిన పనిని ఎంచుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 

 నెటిజన్ల ప్రశంసలు 

ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. "ఉద్యోగ హోదా ముఖ్యం కాదు, మనం పొందే మనశ్శాంతి ముఖ్యం" అంటూ నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. సమాజపు అంచనాలను పక్కన పెట్టి, సంతోషం కోసం ధైర్యంగా అడుగు వేసిన ఈ 'మాజీ ఐటీ మేనేజర్' నేటి కాలంలో ఒత్తిడితో సతమతమవుతున్న ఎంతో మందికి ఒక కనువిప్పులా నిలుస్తోంది.