Israel Vs Lebanon : సెప్టెంబర్ 23 నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకరదాడుల్లో మరణించిన వారి సంఖ్య 558కి చేరింది. వీరిలో చిన్నారులు 50 మంది ఉండగా మహిళలు 94 మంది వరకూ ఉన్నారు. ఆరోగ్య కార్యకర్తలు కూడా నలుగురు చనిపోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 18 వందల 35 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది.


హెజ్బొల్లా రాకెట్ లాంచర్ల కమాండర్ కోబైసీ మరణం:


మూడు రోజులుగా దక్షిణ లెబనాన్‌లోని బెకాలోయ సహా బైరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం జరుపుతున్న భీకదాడుల్లో మరణించిన వారి సంఖ్య 558కి చేరింది. వీరిలో చిన్నారులు 50 మంది వరకూ చనిపోగా.. మరో 94 మంది మహిళలు కూడా ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో బలయ్యారు. ఆరోగ్య కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడడం లేదా మరణించడం జరుగుతోందని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి 54 ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు సామాన్యులను లక్ష్యంగా చేసుకొని ఘోరమైన దాడులు జరుపుతోందని ఆయన ఆరోపించారు. 1975 నుంచి 1990 వరకు కొనసాగిన లెబనాన్ అంతర్యుద్ధంలో కూడా ఒక్కరోజులో ఇంత మంది చనిపోయిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు వేల మంది లెబనాన్ సర్కారు ఏర్పాటు చేసిన 89 షెల్టర్లలోకి చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


బైరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన కీలక నేత ఒకరు మరణించారు. హెజ్బొల్లాకు చెందిన రాకెట్ లాంచర్లు, క్షిపణుల వ్యూహకర్తగా ఉన్న ఇబ్రహీం కోబైసీతో పాటు మరో నలుగురు కమాండర్లు కూడా మృతి చెందినట్లు హెజ్బొల్ల కూడా ధ్రువీకరించింది. సెప్టెంబర్ 23 నుంచి దక్షిణలెబనాన్‌లోని హెజ్బొల్లాకు చెందిన 650 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం 16 వందలకు పైగా దాడులు నిర్వహించింది.


హెజ్బొల్లా కూడా 200 వరకు దాడులు జరపగా.. వాటిలో కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయెలీలు గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.


గాజా యుద్ధం మొదలైన 11 నెలల వ్యవధిలో 9 వేల 613 దాడులు:


అక్టోబర్ 7 నరమేధం తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై దండయాత్ర మొదలు పెట్టింది. ఈ యుద్ధంలో కలుగుచేసుకుంటూ వచ్చిన హెజ్బొల్లా కూడా దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేస్తూ వచ్చింది. ఈ 11 నెలల వ్యవధిలో ఇరు పక్షాల మధ్య 9 వేల 613 బాంబు దాడులు జరిగాయి. వీటిలో అత్యధికంగా ఇజ్రాయెల్ 7 వేల 845 దాడులు ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించింది. వీటిల్లో మొత్తంగా 646 మంది లెబనీస్ మరణించగా వీరిలో సెప్టెంబర్ 23 తర్వాత మరణించిన వాళ్లు 558 మంది ఉన్నారు. అటు హెజ్బొల్లా ఈ వ్యవధిలో ఇజ్రాయెల్‌పై 17 వందల 28 దాడులు చేయగా 32 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు.


ప్రచంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యాల్లో ఇజ్రాయెల్ సైన్యం ఒకటి. దాని దగ్గర అత్యాధునికమైన ఆయుధాలు, క్షిపణులు ఉన్నాయి. హెజ్బొల్లా దగ్గర కూడా భారీగానే ఆయుధాలు ఉన్నాయి. లక్షా 30 వేలకు పైగా ఆయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఒక దేశం కాకుండా ఒక ప్రైవేటు సైన్యం లేదా ఉగ్రమూక దగ్గర ఈ స్థాయిలో భారీ ఆయుధాలు లేవు. ఈ యుద్ధంలో చైనా తన మద్దతు లెబనాన్‌కు ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా అదనపు బలగాలను మధ్యప్రాశ్చానికి పంపింది. అయితే చర్చల ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు ప్రెసిడెంట్ బైడెన్ సూచించారు. ఐక్యరాజ్యసమితి కూడా వెంటనే ఇజ్రాయెల్ తన వైమానిక దాడులు నిలువరించాలని సూచించింది. ఇజ్రాయెల్ మాత్రం సైన్యం మాత్రం లెబనాన్‌ నుంచి పూర్తిగా హెజ్బొల్లాను తుడిచి పెట్టాకే యుద్ధాన్ని ఆపుతామని స్పష్టం చేసింది.


Also Read: 1982లో ఎక్కడైతే యుద్ధం ఆపిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టిన ఇజ్రాయెల్