Iran blows up ship heading to India: ప్రపంచ దేశాల వాణిజ్య  మార్గంగా పిలిచే  హార్ముజ్ జలసంధి సమీపంలో బుధవారం పెను ప్రకంపనలు రేగాయి. భారతదేశానికి భారీ సరుకుతో వస్తున్న థాయ్‌లాండ్ నౌకపై  దాడి  జరిగింది.  దుబాయ్ నుంచి భారత్‌లోని ఓడరేవుకు వస్తున్న  మయూరీ నా నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బలగాలు విరుచుకుపడటం, ఈ దాడి తామే చేశామని ఇరాన్ బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Continues below advertisement

మరైన్ ట్రాఫిక్ డేటా ప్రకారం.. ఈ నౌక తన గమ్యస్థానమైన భారత్‌కు చేరుకోవడానికి కొద్ది గంటల ముందు ఇరాన్ ప్రాంతీయ జలాల వద్ద ఈ విపత్తు సంభవించింది. నౌక వెనుక భాగంపై జరిగిన దాడిలో అది తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక పరిణామంతో నౌకలోని 23 మంది సిబ్బంది ప్రాణభయంతో అల్లాడిపోయారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి జరిగిన తర్వాత  ముగ్గురు సిబ్బంది  కనిపించడం లేదు.  గల్లంతైన వారు సముద్రంలో పడిపోయారా లేదా ఇరాన్ బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  

ఈ ఘటనపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. తామే ఆ నౌకను అడ్డుకున్నామని, నిబంధనల ఉల్లంఘన , భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భారత్ వంటి కీలక వాణిజ్య భాగస్వామ్య దేశానికి వస్తున్న నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. హార్ముజ్ జలసంధిపై తమ పట్టును ప్రదర్శించేందుకే ఇరాన్ ఈ సాహసానికి ఒడిగట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.   

ప్రస్తుతం  గల్లంతైన ముగ్గురు సిబ్బంది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భారత్‌కు వస్తున్న నౌక కావడంతో భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ ,  విదేశీ వ్యవహారాల శాఖ ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. థాయ్‌లాండ్ ప్రభుత్వం తమ నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, సిబ్బంది ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.