Indian man stuck in Bahrain for 42 years: గల్ఫ్ లో ఉపాధి కోసం కేరళ నుంచి వెళ్లిన గోపాలన్ చంద్రన్ అక్కడ 42 ఏళ్ల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. పత్రాలన్నీ పోవడంతో ఎలా ఇక్కడకు రావాలో ఆయనకు తెలియ లేదు. డాక్యుమెంటేషన్ లేకపోవడంతో చిక్కుకుపోయారు. ఇప్పుడు వివిధ సంస్థల సాయంతో ఇండియాకు తిరిగి వచ్చారు.  

గోపాలనన్ చంద్రన్ 22 సంవత్సరాల వయస్సులో బహ్రెయిన్‌కు వెళ్లాడు. కేరళలోని తిరువనంతపురంలోని పౌడికోనం సమీపంలోని ఒక చిన్న గ్రామం గోపాలన్ చంద్రన్ ఊరు. మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం కేరళ నుండి బహ్రెయిన్‌కు వెళ్లాడు. అతను తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనే ఆశతో ఒక మేస్త్రీగా పని చేయడానికి వెళ్లాడు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత  1986లో, చంద్రన్ యజమాని మరణించాడు.  దీనితో అతని ఉద్యోగం పోయింది. అదే సమయంలో  అతని పాస్‌పోర్ట్‌తో సహా అన్ని ట్రావెల్ డాక్యుమెంట్లు  పోయాయి.  ఈ సంఘటన అతన్ని డాక్యుమెంటేషన్ లేని వలసదారుగా మార్చింది.

డాక్యుమెంట్లు లేకపోవడంతో  బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్  నిబంధనల ప్రకారం స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. తర్వాత మనామా శివార్లలో నివసిస్తూ  పెయింటర్‌గా పనిచేస్తూ ఎటువంటి చట్టపరమైన  చిరునామా లేకుండా జీవనం సాగించాడు. 2020లో  చంద్రన్ మరొక కేరళ వలసదారుడితో జరిగిన వివాదం కారణంగా బహ్రెయిన్ పోలీసులు  అరెస్టు చేశారు.   డాక్యుమెంటేషన్ లేనందున, అతను మూడు నెలల పాటు జైలులో ఉన్నాడు. అతని గురించి కేరళ మీడియా కథనాలు ప్రసారం చేసింది.  ప్రవాసి లీగల్ సెల్ బహ్రెయిన్ చాప్టర్  గోపాలన్ చంద్రన్  ను దేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించింది.  బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్,   భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి, అతని తిరిగి స్వదేశానికి రావడానికి అవసరమైన చట్టపరమైన  చర్యలు తీసుకున్నారు.  

ఏప్రిల్ 23, 2025న, చంద్రన్ 42 సంవత్సరాల తర్వాత కేరళకు తిరిగి వచ్చాడు. 42 ఏళ్ల పాటు బహ్రెయిన్ లో ఉన్నా రూపాయి కూడా సంపాదించుకోలేకపోయాడు.  అతని విమాన టికెట్‌ను భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసింది. అతని తల్లికి ఇప్పుడు 95 ఏళ్లు.  చంద్రన్ కథ వలస కార్మికులు ఎదుర్కొనే సవాళ్లను, ముఖ్యంగా డాక్యుమెంటేషన్ కోల్పోవడం వల్ల సంభవించే దీర్ఘకాలిక చట్టపరమైన , సామాజిక సమస్యలను  చర్చకు పెట్టింది.