పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడానికి భారత పౌరులై ఉండాలి, లోక్సభకు 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే, ఏదైనా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
Indian Parliament: భారత్లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. లోక్సభ స్థానాలు 850కి పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. ఎంపిగా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం.

- లోక్సభ స్థానాలను 850కి పెంచుతూ కేంద్రం ప్రతిపాదన చేసింది.
- ఎంపీ అర్హతలు: భారత పౌరసత్వం, కనీసం 25 ఏళ్లు నిండాలి.
- ప్రభుత్వ ఆదాయ పదవులు, మానసిక అస్థిరత వంటివి అనర్హులుగా పరిగణిస్తారు.
- ఎంపీలకు రూ. 2.86 లక్షల నెలసరి వేతనం, ఇతర సౌకర్యాలు లభిస్తాయి.
Indian Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. మహిళా రిజర్వేషన్లు అమలుతోపాటు 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రతిపాదించినట్టు రాష్ట్రాలకు 815 సీట్లు కేటాయించారు. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో అసలు ఒక ఎంపిగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? వారిని ఎవరు ఎలా ఎన్నుకుంటారు? ఇలా ఎన్నికైన వారికి లభించే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం ప్రత్యేకమైన గౌరవం. ప్రజలకు సేవలు అందించే కీలకమైన బాధ్యత. ప్రజా సమస్యలను యావత్ దేశానికి తెలియజేసి జనం గొంతుకగా మారొచ్చు. అలాంటి ఈ పదవికి ఉండే గౌరవం ఎంత గొప్పదో, వారికి ప్రభుత్వం కల్పించే వసతులు, వేతనాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. 2025లో జరిగిన 24 శాతం వేతన పెంపు తర్వాత, ఎంపీల మొత్తం ఆర్థిక ప్యాకేజీ, వారు అనుభవించే సౌకర్యాలు సరికొత్త చర్చకు దారి తీశాయి.
పార్లమెంట్ సభ్యుడు కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే!
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 ప్రకారం, ఒక వ్యక్తి లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే అతను కచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. ఇది సహజసిద్ధమైన పౌరసత్వం కావచ్చు. లేగా చట్టబద్ధంగా పొందినది అయినా కావచ్చు. లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కనీసం 25 ఏళ్లు నిండి ఉండాలి. రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తి వయసు 30 ఏళ్లు దాటి ఉండాలి. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సమక్షంలో రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం విధేయతను ప్రకటిస్తూ ప్రమాణ చేస్తారు. దేశంలోని ఏదైనా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి 2003లో చేసిన మార్పు ప్రకారం, వారు ఏ రాష్ట్ర నుంచి పోటీ చేస్తున్నారో అదే రాష్ట్రంలో ఓటరుగా ఉండాలనే రూల్ తొలగించారు.
అదనంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్(1951) ప్రకారం మరికొన్ని చట్టపరమైన అర్హతలు కూడా నిర్ణయించారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లోక్సభ ఎంపీలు ఆయా నియోజకవర్గాల ప్రజలు సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్యసభ ఎంపీలు రాష్ట్ర శాసనసభ్యుల ద్వారా దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికవుతారు.
అనర్హులుగా ఎప్పుడు ప్రకటిస్తారు?
ఆర్టికల్ 102 ప్రకారం ఒక వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి లేదా పోటీ చేయడానికి కొన్ని సందర్భాలను కూడా రాజ్యాంగంలో పేర్కొన్నారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల కింద ఏదైనా ఆదాయం వచ్చే పదవిలో ఉండకూడదు. కోర్టు ద్వారా అన్సౌండ్మైండ్ అంటే మానసిక అస్థిరత కలిగి ఉన్న వ్యక్తిగా గుర్తించకూడదు. అప్పులు తీర్చలేని స్థితిలో ఉండి, కోర్టు ద్వారా దివాలా తీసిన వ్యక్తిగా గుర్తింపు పొందకూడదు. భారత పౌరసత్వం వదులుకోవడం లేదా ఇతర దేశాల పట్ల విధేయతను కలిగి ఉండటం కూడా నేరం. కొన్ని రకాల నేరాల్లో శిక్ష పడటం లేదా చట్టాల ప్రకారం డిస్ క్వాలిఫై కావడం. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సభ్యత్వం రద్దు అవుతుంది.
ఎంపీలకు ఉన్న ప్రయోజనాలు ఏంటీ?
శాలరీ, అలవెన్స్, పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్, 1954 ప్రకారం ఎంపీల వేతనాలు నిర్ణయిస్తారు. 2025లో చేసిన 24 శాతం పెంపు తర్వాత ఒక ఎంపీ నెలకు పొందే మొత్తం సుమారు 2,86,000గా ఉంది. ఇందులో బేసిక్ శాలరీ 1,24,000, నియోజకవర్గ అలవెన్స్ అంటే నియోజకవర్గ అభివృద్ధి, ఓటర్ల సమస్యల పరిష్కారానికి నెలకు 87వేలు కేటాయిస్తారు. ఆఫీస్ అలవెన్స్ల రూపంలో నెలకు 75 వేల వరకు ఇస్తారు. డైలీ అలవెన్స్ రూపంలో పార్లమెంట్ సమావేశాలు లేదా కమిటీ మీటింగ్స్ ఉన్నప్పుడు 2500 ఇస్తారు.
ప్రయాణ , నివాస సౌకర్యాలు
ఎంపీలకు వారి విధి నిర్వహణ కోసం ప్రభుత్వం అనేక విలాసవంతమైన వసతులు కల్పిస్తోంది. ఏడాదికి 34 ఉచిత డొమెస్టిక్ ఎయిర్ టికెట్లు పొందవచ్చు. ఇందులో కుటుంబ సభ్యులకు కూడా కొన్ని వర్తిస్తాయి. దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం ఉచితంగా కల్పిస్తారు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో అద్దె లేని బంగ్లాలు లేదా నివాస వసతి కల్పిస్తారు. ఏడాదికి 50 వేల యూనిట్ల విద్యుత్, నాలుగు లక్షల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా చేస్తారు. టెలిఫోన్,మొబైల్, ఇంటర్నెట్ ఖర్చు కోసం ఏడాది 1.5 లక్షలు కేటాయిస్తారు.
వైద్య ఖర్చులు, పింఛన్లు
ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ, ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది. పదవి కాలం ముగిసిన తర్వాత మాజీ ఎంపీలకు 31వేల రూపాయల బేసిక్ పింఛన్ లభిస్తుంది. ఒక వేళ ఎంపీ ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉంటే అదనంగా ఉన్న ప్రతి సంవత్సరం 2500 పెన్షన్ పెరుగుతుంది.
ఎంపీలకు వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపీలాడ్స్ కింద ఏడాదికి ఐదు కోట్ల నిధులు కేటాయిస్తారు. ఈ నిధులో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చ్ పనులను ఎంపీలు సూచించవచ్చు. ఈ నిధులు నాన్ ల్యాప్స్బుల్. అంటే ఒక ఏడాది వాడకపోతే ఆ నిధులు తదుపరి ఏడాదికి బదిలీ అవుతాయి.
భారీ సంఖ్యలో లోక్సభ సీట్లు పెరుగుతున్న వేళ అంతే స్థాయిలో ఆశావాహులు పెరుగుతున్నారు. ప్రజాదరణ ఉంటే సామాన్యులు కూడా పార్లమెంట్లో అధ్యక్షా అనే జనగళం వినిపించేందుకు ఛాన్స్ ఉంది.
Frequently Asked Questions
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కనీస అర్హతలు ఏమిటి?
లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుల ఎన్నికల మధ్య తేడా ఏమిటి?
లోక్సభ సభ్యులను ప్రజలు నేరుగా సార్వత్రిక ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు.
ఒక వ్యక్తిని ఎంపీ పదవికి అనర్హుడిగా ఎప్పుడు ప్రకటిస్తారు?
ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండటం, మానసిక అస్థిరత, దివాలా తీయడం, భారత పౌరసత్వం వదులుకోవడం, కొన్ని రకాల నేరాలలో శిక్ష పడటం వంటి సందర్భాలలో అనర్హుడిగా ప్రకటిస్తారు.
పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు) నెలకు ఎంత వేతనం పొందుతారు?
2025లో 24 శాతం వేతన పెంపు తర్వాత, ఒక ఎంపీ నెలకు సుమారు 2,86,000 రూపాయలు పొందుతారు. ఇందులో బేసిక్ శాలరీ, నియోజకవర్గ, ఆఫీస్ అలవెన్స్లు ఉంటాయి.
ఎంపీలకు ప్రభుత్వం కల్పించే ప్రయాణ మరియు నివాస సౌకర్యాలు ఏమిటి?
ఎంపీలకు ఏడాదికి 34 ఉచిత డొమెస్టిక్ ఎయిర్ టికెట్లు, అన్లిమిటెడ్ ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం ఉచితంగా లభిస్తుంది. ఢిల్లీలో అద్దె లేని నివాస వసతి కూడా కల్పిస్తారు.
ట్రెండింగ్ వార్తలు


















