Uttarakashi Tunnel Rescue Updates:



ఆగిన రెస్క్యూ ఆపరేషన్..


ఉత్తరాఖండ్‌ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌ (Uttarakashi Tunnel Rescue Operation) పూర్తైందనుకునే లోపే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క సవాలునీ దాటుకుని వస్తున్నా ఏదో ఆటంకం కలుగుతోంది. ఫలితంగా సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. అమెరికా నుంచి Augur Machine ని తెప్పించి డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. అంతా సజావుగానే సాగుతోందనుకున్న సమయంలో డ్రిల్లింగ్‌కి అడ్డంకి ఎదురైంది. మరో 12 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా ఓ ఐరన్‌ బీమ్ అడ్డం తగిలింది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ ఆగిపోయింది. ఏ అడ్డంకీ లేకపోయుంటే ఈ పాటికే లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు వచ్చే వాళ్లు. ప్రస్తుతానికి మళ్లీ వర్టికల్ డ్రిల్లింగ్ చేపట్టే యోచనలో ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం వచ్చిన సంస్థల ప్రతినిధులంతా ఇప్పటికే దీనిపై చర్చించారు. వర్టికల్ డ్రిల్లింగ్‌కి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డ్రిల్లింగ్‌కి కోసం వినియోగించే మెషీన్‌ ఇన్‌స్టాలేషన్ పూర్తైంది. Border Roads Organisation సిబ్బంది వర్టికల్ డ్రిల్లింగ్‌ సైట్‌కి చేరుకునేందుకు రోడ్డు మార్గం వేస్తోంది. ఆ తరవాత పైకి మెషినరీని పంపించి పై నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. 






20 మందితో వర్టికల్ డ్రిల్లింగ్


ఈ డ్రిల్లింగ్‌ కోసం కనీసం 20 మంది సిబ్బంది పని చేయనున్నారు. Augur Machine ఈ డ్రిల్లింగ్‌కి సరిపోతుందనుకున్నప్పటికీ దీని వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు 14 రోజులుగా వాళ్లు సొరంగం ( Silkyara Tunnel) లోపలే చిక్కుకున్నారు. కేవలం భారీ మెషీన్‌లపైనే ఆధారపడకుండా మిగతా టూల్స్‌నీ వినియోగిస్తోంది రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. సుత్తి, గ్యాస్‌ కట్టర్‌తో పాటు మరి కొన్ని కామన్ టూల్స్‌ వాడుతున్నారు. ఇప్పటికే జొప్పించిన పైప్‌లో ఏమైనా అడ్డంకి వస్తే ఈ టూల్స్‌తోనే వాటిని తొలగించనున్నారు. కాకపోతే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ ఇప్పటికి మరో ఆప్షన్ కనిపించడం లేదు. 


ఆర్నాల్డ్ డిక్స్ ఏమన్నారంటే..


ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ ఆపరేషన్‌పై స్పందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు మరో నెల రోజుల సమయం పడుతుండొచ్చని అంచనా వేశారు. ఎప్పటికి ఇది పూర్తవుతుందో చెప్పలేమని, గరిష్ఠంగా ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రమే తాను చెబుతున్నానని వివరించారు.