Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
NHAI టోల్ బూత్ల వద్ద ఉండే పొడవైన ట్రాఫిక్ జామ్ తొలగించి, మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లెస్ పేమెంట్స్ మాత్రమే అంగీకరించనున్నారు.

No Cash payments at Toll Plazas:
న్యూఢిల్లీ: భారత్లో టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా NHAI అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా NHAI ఇటీవల టోల్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయగా.. ఇవి ఏప్రిల్ 10 నుండి అమలులోకి వస్తాయి. దాని ప్రకారం నేషనల్ హైవేలపై టోల్ చెల్లింపులు నగదు (Cash) రూపంలో చేయలేరు. వాహనదారులు కేవలం FASTag లేక UPI ద్వారా మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాలి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ తగ్గించడం, ప్రయాణికుల టైం ఆదా చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇప్పటికే టోల్ చెల్లింపులు చాలావరకు FASTag ద్వారా జరుగుతున్నాయి. కానీ ఏప్రిల్ 10 నుంచి నేషనల్ హైవేలపై పూర్తిగా నగదు చెల్లింపుల నిలిపివేత అమలులోకి వస్తుంది. అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి టోల్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి.
FASTag లేక UPI ద్వారా టోల్ చెల్లింపులు
ఈ కొత్త పద్ధతిలో టోల్ ఛార్జీలను వాహనదారులు FASTag, UPI వంటి డిజిటల్ విధానాల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై వాహనదారులు నగదు రూపంలో టోల్ చెల్లించలేరు. దాంతో దేశంలో FASTag కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త యాన్యువల్ పాస్లు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి FASTag లేకపోతే వారు UPI ద్వారా పేమెంట్ చేయవచ్చు. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు సాధారణ ఛార్జీ కంటే 1.25 రెట్లు అదనపు మొత్తాన్ని పేమెంట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దాంతో టోల్ వసూళ్లు వేగంగా, ట్రాఫిక్ తగ్గడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుంది.
మినహాయింపు నిబంధనలలో మార్పులు
కొత్త నిబంధనల ప్రకారం కేవలం చెల్లుబాటు అయ్యే మినహాయింపు FASTag లేదా యాన్యువల్ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రయాణంలో కేవలం ID కార్డు చూపి టోల్ కట్టకుండా వెళ్లే పద్ధతికి ముగింపు పలకనున్నారు. ప్రభుత్వ వాహనాల ఎంట్రీకి కూడా ఇకపై మినహాయింపు పాస్ ఉండాలి. లేకపోతే ప్రభుత్వ వాహనాలను సైతం వెళ్లనివ్వరు. గతంలో చాలా మంది ప్రభుత్వ కార్డులను తమ వ్యక్తిగత పనులకు మినహాయింపు కోసం ఉపయోగించేవారు. టోల్ ఛార్జీల నుంచి తప్పించుకునేవారు. దేశంలోని పలు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై 1,150కి పైగా Toll plazas ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త విధానాలు అమలులోకి తెస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు.
ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి యాన్యువల్ పాస్ బెస్ట్
ఓ ఏడాదిలో ఎక్కువ ప్రయాణాలు చేసే వారికి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ మంచి ఆప్షన్ అని భావిస్తున్నారు. తద్వారా పదేపదే రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకసారి పేమెంట్ చేసి పదేపదే టోల్ కట్టడానికి రీఛార్జ్ చేసే సమస్య నుండి తప్పించుకోవచ్చు. ఇటీవల యాన్యువల్ పాస్ ధరను పెంచారు. గతంలో 3000గా ఉండే వార్షిక పాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి రూ. 3075 కు పెంచారు. ఈ పాస్ ద్వారా ఒక ఏడాదిలో సుమారు 200 ప్రయాణాలకు అవకాశం కల్పిస్తుంది. అత్యవసర సమాయాల్లో మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ మరిచిపోయినా, యాన్యువల్ పాస్ ఉంటే మీకు ఏ సమస్యా ఉండదు.
ట్రెండింగ్ వార్తలు




















