TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
Tamil Nadu Minister S Keerthana | తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకైక మహిళా మంత్రి ఎస్ కీర్తనను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆమె వెనుదిరిగారు.

TVK Party MLA Keerthana | చెన్నై: తమిళనాడులో ఏర్పాటైన విజయ్ సర్కార్ అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన ఏకైక మహిళా మంత్రి ఎస్ కీర్తన ప్రమాణం చేయకుండానే వెనుదిరిగారు. ఆమెను గెలుపునకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ అడిగారు. అయితే తాను ఎమ్మెల్యేగా నెగ్గినట్లు ధ్రువీకరణ సర్టిఫికెట్ మరిచిపోయి వచ్చానని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఆ సర్టిఫికెట్ లేకపోతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వీలులేదని స్పష్టం చేయడంతో మంత్రి ఎస్ కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
ఈరోజు సాయంత్రం స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయవచ్చు. బిగినర్స్ మిస్టేక్ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఆమెకు రాజకీయాలు కొత్త కాదని తమిళనాడుతో పాటు ఏపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పార్టీలకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చేశారు.. ఆమెకు ఈ విషయం తెలియదా అని ట్రోల్ చేస్తున్న వారు సైతం ఉన్నారు. తమిళనాడులో యంగెస్ట్ ఎమ్మెల్యే, యంగెస్ట్ మినిస్టర్, ఏకైక మహిళా మంత్రిగా ఎస్ కీర్తన రికార్డులు నెలకొల్పారు. శివకాశి నియోజకవర్గంలో నెగ్గిన తొలి మహిళా ఎమ్మెల్యేగా టీవీకే నాయకురాలు కీర్తన నిలిచారని తెలిసిందే.
తమిళనాడు అసెంబ్లీలో ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించిన టీవీకే (TVK) అధినేత విజయ్ కాంగ్రెస్ సహా పలు చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు సీఎం విజయ్, 9 మంది మంత్రులతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

నేడు కొత్త శాసనసభ సభ్యులతో తాత్కాలిక స్పీకర్ కరుప్పయ్య ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ హాలుకు అధికార పార్టీ టీవీకే, ప్రతిపక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే సభ్యులు వచ్చారు. సీఎం సీటులో జోసెఫ్ విజయ్, ప్రతిపక్ష నేత సీటులో ఉదయనిధి స్టాలిన్ కూర్చున్నారు. అనంతరం తాత్కాలిక స్పీకర్ కొత్త ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
విజయ్, ఉదయనిధి, ఎడప్పాడి ప్రమాణ స్వీకారం
ముందుగా ముఖ్యమంత్రి విజయ్ పెరంబూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. దాంతో తిరుచ్చి ఈస్ట్ సీటును ఆయన వదులుకుంటున్నారు. సీఎం విజయ్ తరువాత మంత్రులు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, అరుణ్రాజ్, వెంకటరామన్, సెంగోట్టయన్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్, ఆ తర్వాత మాజీ సీఎంలు ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం, మాజీ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన విప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు తమిళ అక్షర క్రమం ప్రకారం ప్రమాణం చేస్తున్నారు.
విజయ్ బిగినర్ మిస్టేక్స్..
సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చిన విజయ్ సైతం ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచాక కొన్ని తప్పిదాలు చేయడం మనం చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అనుమతి కోరుతూ విజయ్ నాలుగుసార్లు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిశారు. వాస్తవానికి తొలిసారి గవర్నర్ను కలిసేందుకు వెళ్లే సమయంలో మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అని గవర్నర్ను విజయ్ కోరారు. కానీ తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న లెటర్ సమర్పిచకపోవడం బిగినర్స్ మిస్టేక్ అని వైరల్ అయింది. తరువాత వెళ్లి గవర్నర్ను కలిసినా తనను ఏ విధానంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలో విజయ్ చెప్పలేకపోయారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం మరింత ఆలస్యమైంది. చివరగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి సంఖ్యాబలం ఉందని లేఖలు సమర్పించగా విజయ్ కి లైన్ క్లియర్ అయి ఆదివారం నాడు (మే 10న) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















