PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Tamil Nadu Elections 2026: జనాభా నియంత్రణ సరిగ్గా చేసిన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు తగ్గవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పథనంథిట్ట: జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్యను తగ్గించడం లేదని, అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా మొత్తం సీట్ల సంఖ్యను పెంచుతామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేరళంలో LDF ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, ఎన్డీయే అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో శనివారం (ఏప్రిల్ 4న) జరిగిన ఎన్డీయే ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణను ఆమోదించడం కోసం పార్లమెంట్ సమావేశాలను ఏప్రిల్ 16 నుండి 18 వరకు నిర్వహిస్తామని తెలిపారు.
దక్షిణ భారత్ లోక్సభ సీట్లలో తగ్గింపు ఉండదు: పీఎం మోదీ
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, పార్లమెంట్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు గురువారం (2 ఏప్రిల్) నాటికే ముగియాల్సి ఉంది, కానీ లోక్సభ, రాజ్యసభలు ఏప్రిల్ 16 నుండి 3 రోజుల పాటు సమావేశమవుతాయి. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచడం సహా పలు బిల్లులు సభలోకి రానున్నాయి. జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణ భారత రాష్ట్రాల సీట్ల సంఖ్యలో ఎలాంటి కోత ఉండదని, అన్ని రాష్ట్రాల్లో సమానంగా సీట్ల పెంపు ఉంటుందని పీఎం మోదీ అన్నారు.
‘జనాభా నియంత్రణ కారణంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదు. వారి సీట్లు పూర్తిగా సురక్షితంగా ఉండేలా పార్లమెంటు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణ దిశగా మంచి పని చేశాయి. వారి జనాభా వృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ, వారి లోక్సభ సీట్లు ఏమాత్రం తగ్గకూడదు’ అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణ
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుంది. ఈ సమయంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు వారి పార్లమెంటరీ సీట్లను తగ్గించకూడదని కాంగ్రెస్ వాదించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ఇటీవల మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద సమస్య అని, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్లమెంటరీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.
మహిళా రిజర్వేషన్లను ఖరారు- పీఎం మోదీ
2029 నుండి పార్లమెంటులో మహిళలకు 33 శాతం భాగస్వామ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని మోదీ కోరారు. ‘మా ప్రభుత్వం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ గురించి చర్చించి, ముందుకు తీసుకెళ్లడానికి పార్లమెంటు ఏప్రిల్ 16 నుండి 18 వరకు తిరిగి సమావేశం కానుంది. 2029 నుండి పార్లమెంటులో మహిళల 33 శాతం భాగస్వామ్యాన్ని అందించడమే మా లక్ష్యం’ అని ఆయన చెప్పారు.
మహిళా సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ‘ఎన్డీయే విధానాలతో మహిళలే అతిపెద్ద లబ్ధిదారులు. మహిళా సాధికారత, ప్రాతినిధ్యం మా ప్రాధాన్యతలు. మహిళల జీవితాలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేశాం. మేం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించాం, జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేశాం. మహిళల పేరు మీద ఇళ్లు నిర్మించాము’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.`
ట్రెండింగ్ వార్తలు






















