Train Derails: ఉత్తరప్రదేశ్‌లో మథుర రైల్వే స్టేషన్‌లో  సెప్టెంబర్ 26న ఓ ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు బయటు వచ్చాయి. రైలు ఇంజిన్ క్యాబిన్‌లో ఉన్న వ్యక్తికి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైలు కదులుతున్న విషయాన్ని అందులో ఉన్న వ్యక్తి గమనించకుండా వీడియో కాల్‌లో బిజీగా ఉండడంతో ఘటన జరిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే.. ఆ రైలు ప్లాట్‌ఫామ పైకి దూసుకెళ్లి.. అక్కడ ఉన్నటువంటి ఓ కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల ఓ మహిళ కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో ఆమెను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


తాజాగా ఈ ఘటనకు గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. రైల్వేలో సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. క్యాబిన్ కెమెరాల‌కు ఆ ఘ‌ట‌నకు చెందిన దృశ్యాలు చిక్కాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. ఘటనపై రైల్వే శాఖ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మొత్తంగా ఐదుగురిని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటికే రైలు నుంచి ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడున్న ప్రయాణికులు. అయితే ఈ ప్రమాదం వల్ల మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్ అలాగే దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. 






నివేదికల ప్రకారం.. షకుర్‌బస్తీ-మథుర MEMU (04446) సెప్టెండర్ 26 రాత్రి 10:49 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అయితే రైలు గమ్యస్థానం చేరుకున్నాక ప్రయాణికులు అందులో నుంచి దిగిపోయారు. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన తర్వాత డీటీసీ క్యాబ్ నుంచి లోకో పైలట్లు దిగిపోయారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ రైలు లైటింగ్ సిబ్బంది సచిన్ క్యాబ్‌లోకి ప్రవేశించాడు. అక్కడ తన బ్యాగ్‌ను ఇంజిన్‌‌ను నియంత్రించే పరికరం థ్రోటల్ మీద ఉంచి ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడటంలో నిమగ్నమయ్యాడు. అయితే థ్రోటల్‌పై బ్యాగ్ ఒత్తిడి కారణంగా రైలు  ఫార్వర్డ్ పొజిషన్‌లోకి వెళ్లి డీటీసీ క్యాబ్‌లో సగం ప్లాట్‌ఫారమ్ నంబర్ రెండుపైకి ఎక్కింది. 


ఈ సంఘటన‌తో ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోయి రైలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సచిన్‌కు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 47 ఎంజీ/100 ఎంఎల్ రీడింగ్‌లో అతను మద్యం సేవించినట్లు తేలిందని నివేదిక పేర్కొంది. అయితే తన డ్యూటీ ఇన్‌చార్జి హర్మాన్ సింగ్ సూచన మేరకు లోకో పైలట్ నుంచి క్యాబ్ కీని తీసుకురావడానికి వెళ్లినట్టుగా సచిన్ చెప్పాడు. లోకో పైలట్ తాళం లోపల ఉందని చెప్పడంతో.. డీటీసీ క్యాబ్‌లోకి వెళ్లినట్టుగా తెలిపాడు. 


రైలులోకి వెళ్లి బ్యాగ్ పెట్టిన కొద్దిసేపట్లోనే రైలు కదలడంతో భయపడిపోయానని, ఎమర్జెన్సీ బ్రేక్ వేసే సమయానిక  రైలు ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించిందని సచిన్ చెప్పాడు. థ్రోటల్ ఫార్వర్డ్ పొజిషన్‌లో ఉందని, కీ 'ఆన్' పొజిషన్‌లో ఉందని కూడా చెప్పుకొచ్చాడు. రైలు స్విచ్ ఆన్‌లో ఉంచినందుకు లోకో పైలట్ గోవింద్ హరి శర్మను సచిన్ తప్పుపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు.