Sonia Gandhi: 


ప్రత్యేక సమావేశాలపై లేఖ 


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ నెల 18-22 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏ చర్చలు జరుగుతాయో చెప్పాలని ప్రధానికి రాసిన లేఖలో అడిగారు సోనియా. ఇతర పార్టీలతో ఏ మాత్రం చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. అసలు ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నారో స్పష్టత లేదని అన్నారు. 


"సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. కానీ మిగతా పార్టీలకు ఓ మాట కూడా చెప్పకుండానే వీటిని ఏర్పాటు చేశారు. మాలో ఎవరికి కూడా ఈ సమావేశాల అజెండా ఏంటో స్పష్టత లేదు. కీలక అంశాలపై చర్చించేందుకు మాకు సమయం కేటాయిస్తారనే ఆశిస్తున్నాం"


- సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత






ఇదే లేఖలో మొత్తం 9 అంశాలను ప్రస్తావించారు సోనియా. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం,నిరుద్యోగం సమస్యలపై మాట్లాడేందుకు సమయం కేటాయించాలని అడిగారు. వీటితో పాటు మరో 8 అంశాలను పేర్కొన్నారు. 


1. దేశంలో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగతం, చిన్న మధ్య తరహా పరిశ్రమలపై ఒత్తిడి పెరగడం లాంటి అంశాలపై చర్చించేందుకు అవకాశమివ్వాలి. 


2. రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలు, కనీస మద్దతు ధర విషయంలో రైతు సంఘాలకు ఇచ్చిన హామీలపై చర్చ  జరగాలి. 



3. అదానీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు జేపీసీ కమిటీని నియమించాలి. 


4. మణిపూర్‌ అల్లర్లపై చర్చించడంతో పాటు, ఆ సమస్యకు పరిష్కారం చూపించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడంపై చర్చ జరగాలి. 


5. హరియాణా సహా పలు రాష్ట్రాల్లో అశాంతిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాధానం చెప్పాలి. 


6. లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. 


7. కులగణన చేపట్టాల్సిన అవసరంపై చర్చ జరగాలి. 


8. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూడాలి. 


9.ఈ మధ్య కాలంలో భారీ విపత్తులతో అల్లకల్లలోమైన రాష్ట్రాల పరిస్థితిపైనా చర్చ జరగాలి. 


ప్రజా సమస్యలకే ప్రాధాన్యతనిస్తూ సమావేశాల్లో తాము చర్చకు సిద్ధమవుతామని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ చర్చించేందుకు సమయం కేటాయించాలని అన్నారు.