Railway Rules for Ticket upgradation: దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణాలు చేయాలనుకున్న వారు రైళ్లలో ప్రయాణించి ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఎప్పటికప్పుడూ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. వాటిలో ఒకటి టికెట్ అప్‌గ్రేడేషన్ స్కీమ్. ఈ విధానంలో స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్న ప్రయాణికులు కూడా AC కోచ్‌లో జర్నీ చేయవచ్చు. 

ఈ నియమం సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. కానీ టికెట్ బుకింగ్ సమయంలో AC సీట్లు అందుబాటులో ఉండవు. ఈ రైల్వే స్కీమ్ ప్రయాణికులకు అదనపు ఛార్జీలు లేకుండానే దాని కంటే మెరుగైన క్లాస్ లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకం ఎలా పనిచేస్తుంది, ఏ షరతులు వర్తిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

రైల్వే ఆటోమేటిక్ అప్‌గ్రేడేషన్ పథకం 

రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ఆటోమేటిక్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. దాంతో రైలులోని ఖాళీ సీట్లను ప్రయాణికులు ఉపయోగించుకోవచ్చు. ఏదైనా రైలులో AC కోచ్ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు, స్లీపర్ కోచ్ సీట్లు పూర్తిగా నిండినప్పుడు, సిస్టమ్ ద్వారా కొంతమంది ప్రయాణికులు సొంతంగా అప్‌గ్రేడ్ చేసుకుంటారు.

ఈ స్కీంలో అదనపు ఛార్జీలు వసూలు చేయరు. మీ దగ్గర స్లీపర్ టికెట్ ఉండి, అదృష AC సీటు ఖాళీగా ఉంటే, అదే టికెట్‌తో AC కోచ్‌లో ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది. టికెట్ బుక్ చేసే సమయంలో ప్రయాణికులు Yes for Auto Upgrade అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఎవరికి ప్రయోజనం.. ముఖ్యమైన కండీషన్ ఏంటి ?

ఆటోమేటిక్ అప్‌గ్రేడేషన్ సౌకర్యం టికెట్ కన్ఫాం అయిన ప్రయాణికులకు మాత్రమే లభిస్తుంది. వెయిటింగ్ లేదా RAC టికెట్ హోల్డర్‌లకు ఈ పథకం వర్తించదు. దీనితో పాటు ఈ పథకం గ్రూప్ బుకింగ్ లేదా ప్రత్యేక రైలు టికెట్‌లకు సైతం వర్తించదని అధికారులు తెలిపారు. మీ టికెట్ అప్‌గ్రేడ్ అయితే  రైలు చార్ట్ తయారు చేసిన తర్వాత మీ కోచ్, సీటు నంబర్ మారి AC కోచ్‌లో కనిపిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ సౌకర్యం పూర్తిగా ఉచితం. అంటే స్లీపర్ టికెట్‌తో AC కోచ్ లో లగ్జరీగా ప్రయాణించవచ్చు. రైల్వే శాఖ కూడా తమ ఖాళీ సీట్ల నుండి అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.