Bharat Jodo Nyaya Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో న్యాయయాత్ర రూట్ మ్యాప్ మారింది. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్ (West Bengal)లో యాత్ర ప్రవేశించినప్పటికీ...అనూహ్యంగా చివరి క్షణాల్లో రూటును మార్చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఖరారు చేసిన దారిలో కాకుండా...కొత్త రూట్ ను ఎంపిక చేశారు.  బెంగాల్ లోని ఉత్తర ప్రాంతాల్లో యాత్రను త్వరగా కంప్లీట్ చేసి....బిహార్‌ ( Bihar )లోకి వెళ్లేలా మార్గాన్ని మార్చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించారు. న్యాయయాత్ర మార్గంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు బిహార్ యాత్ర చేసిన తర్వాత మళ్లీ బెంగాల్ లో యాత్ర చేపట్టనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ముర్షిదాబాద్‌, మాల్దా నియోజకవర్గాల్లో తరువాత యాత్ర కొనసాగుతుందని హస్తం పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం బెంగాల్ లో జరుగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు సీపీఎం నేతలు, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 


తమ ప్రతిపాదనను కాంగ్రెస్ పట్టించుకోలేదన్న మమత బెనర్జీ
పార్లమెంట్ సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, అందుకే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండబోదని, జాతీయస్థాయిలో సంబంధాల పైనా పునరాలోచిస్తామని మమత స్పష్టం చేశారు. ఆమె ప్రకటన చేసిన తర్వాత ఆప్ కూడా...హస్తం పార్టీకి ఝలక్ ఇచ్చింది. అన్ని చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తామని...కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోమని ప్రకటించింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ బరిలోకి దిగుతుందని ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ తెలిపారు. 


అస్సాం పోలీసులకు భయపడబోనన్న రాహుల్ 
తనతో పాటు కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా మరికొందరిపై అస్సాం పోలీసులు కేసులు నమోదు చేయడంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడబోనన్న ఆయన, తనపై మరిన్ని కేసులు నమోదు చేసుకోవాలని అస్సాం పోలీసులకు సవాల్ చేశారు. తాను కేసులకు బెదిరిపోనన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ తనను బెదిరించలేవన్న రాహుల్ గాంధీ...బీజేపీ, ఆస్‌ఎస్ఎస్​ అస్సాం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.తనపై మరిన్ని కేసులు నమోదు చేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ చేశారు. అలాగే అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ దేళంలోనే అత్యంత అవినీతి సీఎం అని విమర్శించారు. బార్​పేటలో భారత్ జోడో న్యాయ్​ యాత్రలో భాగంగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో భయంతో పాటు ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించి వారి భూములు, డబ్బును దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాజీరంగా నేషనల్ పార్క్​లో కూడా సీఎం హిమంత బిశ్వశర్మకు భూములు ఉన్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ