PM Modi Launched Three Naval Ships In Mumbai: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని (Mumbai) నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) హాజరై.. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి (INS Nilagiri), ఐఎన్ఎస్ సూరత్ (INS Surat), ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను (INS Waghgheer) బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న భారత్‌కు ఇది పెద్ద ముందడుగే అని చెప్పాలి. 














'నౌకాదళానికి నూతన బలం'


దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివని.. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్కచేయరని ప్రధాని మోదీ అన్నారు. 'నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడింది. తొలిసారిగా 2 యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభించుకున్నాం. ఇవన్నీ భారత్‌లో తయారైనవే. వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత అందుతుంది. సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు నేవీలో చేరాయి. రక్షణరంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలి.' అని మోదీ పిలుపునిచ్చారు.


ఐఎన్ఎస్ సూరత్ 


ఐఎన్ఎస్ సూరత్ పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తోన్న నాలుగో యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునికి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఇందులో స్వదేశీ వాటా శాతం 75 శాతం. ఈ యుద్ధ నౌకలో నెట్ వర్క్ సెంట్రిక్ సామర్థ్యం సహా అధునాతన ఆయుధ - సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి.


ఐఎన్ఎస్ నీలగిరి


ఐఎన్ఎస్ నీలగిరి పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించగా.. ఇది తర్వాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తోంది.


ఐఎన్ఎస్ వాఘ్‌షీర్


ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ పీ75 కింద రూపొందిస్తున్న ఆరో చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.


Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?