PM Modi News: ఆరు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు, పార్టీ ఎంపీలు హర్ష వర్ధన్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు వచ్చారు. ప్రధాని మోదీ వచ్చీ రాగానే.. దేశంలో ఏం జరుగుతోందంటూ జేపీ నడ్డాను ప్రశ్నించినట్లు అక్కడకు వెళ్లిన పార్టీ నాయకులు తెలిపారు. 






"దేశంలో ఏం జరుగుతోందని ప్రధాని మోదీ జేపీ నడ్డాను అడిగారు. దీనిపై స్పందించిన నడ్డా.. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో సాధించిన అభివృద్ధి గురించి వివరిస్తూ నేతలంతా ప్రజలకు దగ్గర అవుతున్నారని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని జేపీ నడ్డా వివరించారు." - బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ


మరో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. పార్టీ ప్రజావాణి కార్యక్రమం ఎలా కొనసాగుతోందని ప్రధాని మోదీ అడిగారని.. అందుకు తాము సమాధానాలు కూడా చెప్పామని వివరించారు.


ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20వ తేదీన అమెరికా పర్యటనకు బయలుదేరి.. న్యూయార్క్‌లో జూన్ 21వ తేదీన 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఎన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వైట్ హౌస్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ ఇద్దరు దేశాధినేతలు గురువారం రోజు చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు.. గౌరవార్థం జో బిడెన్ వైట్ హౌస్‌లో డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి డిన్నర్ చేశారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్‌ బైడెన్‌ కూడా మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. దాదాపు 400 మంది అతిథులు ఈ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బైడెన్, మోదీ చాలా జోవియల్‌గా కనిపించారు. మోదీపై బైడెన్ ఓ జోక్ వేశారు. అది విని ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. ఆల్కహాల్ తీసుకోకుండానే మోదీ డిన్నర్ ముగించేశారంటూ బైడెన్ అన్న మాటకు మోదీ గట్టిగా నవ్వారు. అంతే కాదు. తమ ఇద్దరికీ ఈ అలవాటు లేదని చెప్పారు. వీరిద్దరి భేటీలో రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలు చేసుకున్నారు.  


అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కైరో చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్‌ బౌలీ స్వాగతం పలికారు. మొదటి సారి ఈజిప్టు వెళ్లిన ప్రధాని.. ఆదివారం సాయంత్రం తన పర్యటనను ముగించుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసితో చర్చలు జరిపారు. అరబ్ దేశం అత్యున్నత గౌరవం 'ఆర్డర్ ఆఫ్ ది నైల్'ను ప్రధాని మోదీ అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. రెండు దేశాలు తమ సంబంధాన్ని "వ్యూహాత్మక భాగస్వామ్యం"గా పెంచుకున్నాయి. ప్రెసిడెంట్ ఎల్-సిసి మోడీకి ఈజిప్ట్ అత్యున్నత రాష్ట్ర గౌరవమైన 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి లభించిన 13వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది.