Miyazaki mango cultivation in India: సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో రూ. 100 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. కానీ, కిలో మామిడి పండ్ల ధర ఏకంగా రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉందంటే నమ్ముతారా? అవును, వెండి ధర కంటే ఎక్కువ విలువైన ఈ అరుదైన మామిడి పండ్లు ఇప్పుడు భారత్లో సాగు అవుతున్నాయి. వీటిని దొంగల నుంచి కాపాడుకోవడానికి రైతులు ఏకంగా Z-ప్లస్ రేంజ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఎందుకీ పండు అంత ప్రత్యేకం?
జపాన్కు చెందిన ఈ అరుదైన మియాజాకి మామిడి పండ్లను జపనీస్ భాషలో తైయో నో తమగో అని పిలుస్తారు. దీని అర్థం సూర్యుని అండం . ఇవి సాధారణ మామిడి పండ్లలా పసుపు రంగులో కాకుండా, ముదురు ఎరుపు లేదా పర్పుల్ రంగులో మెరుస్తూ కెంపుల వలె కనిపిస్తాయి. వీటిలో చక్కెర శాతం సాధారణ పండ్ల కంటే 15% ఎక్కువగా ఉండటమే కాకుండా, అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.
భారత్లో మియాజాకి సాగు - తుపాకులతో కాపలా!
ఇటీవలి కాలంలో మన దేశంలోని రైతులు కూడా ఈ అరుదైన పంటపై మొగ్గు చూపుతున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఒక రైతు దంపతులు తమ తోటలోని రెండు మియాజాకి చెట్లను కాపాడేందుకు 9 మంది సెక్యూరిటీ గార్డులను, 6 జర్మన్ షెపర్డ్ కుక్కలను కాపలా పెట్టారు. గతంలో దొంగలు ఈ పండ్లను ఎత్తుకెళ్లడంతో వారు ఈ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోని రైతులు కూడా వీటిని సాగు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది?
ఈ పండ్లు పండించడానికి జపాన్లో ప్రత్యేకమైన గ్రీన్హౌస్ పద్ధతులు ఉపయోగిస్తారు. ప్రతి పండుకు సమానంగా ఎండ తగిలేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ . ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. అంతర్జాతీయ వేలంలో ఒక్కో పండు ధర సుమారు రూ. 50,000 వరకు పలుకుతుంది.
ప్రస్తుతానికి ఈ పండ్లు సామాన్య రైతులకు ఒక నిధి లాంటివి. ఆకట్టుకునే రంగు, అద్భుతమైన రుచి, మరియు ఆకాశాన్నంటే ధరతో మియాజాకి మామిడి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా రికార్డు సృష్టిస్తోంది.
