న్యూఢిల్లీ: మెటా, భారత ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ డీప్ ఫేక్ కంటెంట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణ లేఖ పంపారు. ఆయన CSAM (పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్), డీప్ ఫేక్ కంటెంట్, ప్లాట్ ఫారమ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై సారీ చెప్పారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని రకాల కంటెంట్ ను ప్రోత్సహించడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు మెటా సంస్థ అంగీకరించింది. నీట్ పేపర్ లీకేజీ నిరసన వేళ ప్రధాని మోదీ Gen Z యువతను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను జులై 23న ఫేస్‌బుక్ కొన్ని గంటల పాటు నిలిపివేయడం వివాదాస్పదమైంది. 

Continues below advertisement

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, మెటా కేవలం 'ఇంటర్మీడియరీ'లోకి రాదని స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఏ కంటెంట్ ఎవరికి చేరుతుందో కంపెనీ స్వయంగా నిర్ణయిస్తుంది. అలాంటి సందర్భంలో, IT చట్టం కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణ మెటాకు వర్తించదని ప్రభుత్వం మెటాకు స్పష్టం చేసింది. మెటా ఈ మొత్తం విషయంలో తన తప్పును అంగీకరించి, విచారం వ్యక్తం చేసి, క్షమాపణలు చెప్పింది.  

సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ దుర్వినియోగంపై ప్రభుత్వం ఆందోళన 

భారత చట్టాలను తప్పనిసరిగా పాటించాలని మెటాకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల దుర్వినియోగంపై కూడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు, ప్రధాని మోడీ పోస్ట్ తొలగింపు అంశాన్ని ప్రభుత్వం లేవనెత్తింది. ప్లాట్ ఫారమ్ లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన కంటెంట్ సమస్యను కూడా లేవనెత్తింది. తమ వద్ద కఠినమైన అంతర్గత నియమాలు అమలులో ఉన్నాయని మెటా బదులిచ్చింది. తమ ప్లాట్ ఫారమ్ ను దుర్వినియోగం చేయడం ఏ పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మెటా పేర్కొంది.

Also Read: Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?

మంత్రి, అధికారులతో సమావేశమైన మెటా ప్రతినిధులు

అంతకుముందు, మెటా గ్లోబల్ టీమ్ బుధవారం IT మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ తొలగింపు విషయంలో మెటా అధికారులను కేంద్ర ప్రభుత్వం పిలిపించింది. సమావేశంలో ముఖ్యమైన పోస్ట్ లపై జరిగిన తప్పుడు చర్యలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో బాలల లైంగిక వేధింపులు, వేధింపుల కంటెంట్ (CSAM)ను  నిరోధించడంలో వైఫల్యం, ఇతర నియంత్రణ సమస్యలపై చర్చ జరిగింది.

మెటా సీనియర్ అధికారుల బృందం ఈరోజు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ను సైతం కలిసింది. దాదాపు అరగంట పాటు మంత్రితో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఇటీవల చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ను కొన్ని గంటల పాటు తొలగించడంపై చర్చించారు. ప్రధాని మోదీ ఈ పోస్ట్ లో యువతను ఉద్దేశించి ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం సాకుగా చూపుతూ మెటా కంపెనీ క్షమాపణలు చెప్పింది. పోస్ట్ పొరపాటున రిమూవ్ అయిందని, తరువాత పోస్టును పునరుద్ధరించామని పేర్కొంది.

సేఫ్ హార్బర్ రక్షణ అంటే ఏమిటీ..

వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కు సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ (థర్డ్ పార్టీ కంటెంట్ నుంచి చట్టపరమైన రక్షణ) ఉంటుంది. ఇదే విధంగా మెటాకు కూడా కొన్ని చట్టపరమైన మినహాయింపులు సేఫ్ హార్బర్ వల్ల దక్కాయి. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ రద్దు అయితే మెటా పబ్లిషర్‍గా గుర్తించాలి. ఈ క్రమంలో సంస్థకు చెందిన సోషల్ మీడియాలో పోస్టు అయ్యే పోస్టులకు మెటా అధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమేదు చేసే అవకాశం కేంద్రానికి ఉంటుంది. 3 రోజుల్లో జుకర్ బర్గ్ క్షమాపణ చెప్పకపోతే ఈ సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేస్తామని పార్లమెంటరీ స్థాయి కమిటీ హెచ్చరించింది. దాంతో మెటా టీమ్ భారత్‌కు వచ్చి విచారణ ఎదుర్కొంటోంది. మరోవైపు జుకర్ బర్గ్ సైతం మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పారు.