Maoists Letter over Arms surrender | రాయ్పూర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలను వీడటం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని తెలుపుతూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. CCM సతీష్ దాదా తర్వాత, మరొక CCM కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేం MMC స్పెషల్ జోనల్ కమిటీ కూడా హాథియార్ను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం ప్రణాళికను అంగీకరించాలన్న నిర్ణయానికి వచ్చామని.. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ రాసింది.
ఫిబ్రవరి 15 వరకు గడువివ్వండి.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉంది. మేం సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించడానికి, వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు కొంత సమయం కావాలి. కనుక మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాము. ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి మరో ఉద్దేశ్యం లేదు. ఒకరితో ఒకరు త్వరగా మాట్లాడటానికి, చర్చిండానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేని కారణంగా దీనికి సమయం పడుతుంది. ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువులోపు (మార్చి 31, 2026) ఉంది. అప్పటి వరకు, 3 రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలి. వారి భద్రతా దళాలు కూంబింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరుతున్నాము.
వారోత్సవాలను నిర్వహించడం లేదు
రాబోయే PLGA వారంలో వారు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదు. వారు ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను సైతం ఆపాలి. ఇన్పుట్లు లేదా సమాచారం ఆధారంగా దళాలను నియమించాలి. ఈసారి మేము PLGA వారోత్సవాన్ని జరుపుకోం. మా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. 2 వైపుల నుండి ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. మేం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, కలిసి మెరుగైన నిర్ణయానికి రావడం సాధ్యమవుతుంది. ప్రభుత్వం నుంచి మాకు సానుకూల నిర్ణయం వస్తుందని నమ్ముతున్నాం. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు, ఈ మెస్సేజ్ ప్రతిచోటా మీకు చేరే వరకు జోన్ లోని మా సహోద్యోగులు తమ అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మావోయిస్టు ప్రతినిధి, 3 రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అనంత్ కోరారు.
ఈ సందేశం మా సహోద్యోగులకు చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థనను రేడియోలో ప్రసారం చేయాలి. వార్తలను తెలుసుకోవడానికి, రోజువారీ తాజా వార్తలతో తాజాగా ఉండటానికి మా సహోద్యోగులకు అందుబాటులో ఉన్న ఏకైక మాధ్యమం ఇదే. అందుకే రేడియోలో ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రసారం చేయాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాసిన లేఖలో మావోయిస్టులు కోరారు.
జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం కావాలి
ఈలోగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుతున్నాం. తద్వారా మేం మా ఆయుధాలను విడిచిపెట్టడానికి, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలం. ఆ తేదీ వరకు భద్రతా దళాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తుంటాం. మా ప్రకటనతో పాటు ప్రభుత్వ ప్రతిస్పందనను రాబోయే కొన్ని రోజులు, సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో ప్రసారం చేస్తే మంచిదని వీలైనంత త్వరగా మా సహచరులకు చేరుతుందని అనంత్ పేర్కొన్నారు.
మా సహచరులు, సోను దాదా, సతీష్ దాదాలను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మా కేసును సమర్పించి తగినంత సమయం కోరాలని అభ్యర్థిస్తున్నాం. ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు మాకు, ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో జర్నలిస్టులు పోషించిన పాత్రనే MMC జోన్లో కూడా పోషించాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.