Snake Viral News: ప్రేమగానో లేక తన స్నేహితుల ముందు విన్యాసాలు చేసి బిల్డప్ ఇవ్వాలనుకున్నాడో తెలియదు గానీ పామును ముద్దాడబోయాడు. ఈ క్రమంలోనే అది కాటు వేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పాము కాటుతో చనిపోయిన పాము పట్టే వ్యక్తి


మహారాష్ట్రలోని నాశిక్ సిన్నర్ కు చెందిన నాగేశ్ అనే పాముల సంరక్షకుడు శుక్రవారం ఓ పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని తీసుకుని తన స్నేహితుని కేఫ్ వద్దకు వెళ్లాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ పామును మేడపైకి తీసుకెళ్లి దానితో విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలోనే పామును ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దాడబోయాడు. అది కాస్త అతడి పెదవిపై కాటు వేసింది. దీంతో అప్రమత్తమైన స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.


కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో జరిగింది. పాములు పట్టే అలవాటు ఉన్న ఓ వ్యక్తి అదే పాము కాటుతో ప్రాణం కోల్పోయారు. ఆయన పేరు కొండూరి నాగబాబు శర్మ. వృత్తి రీత్యా  పురోహితుడు. ఆయనది కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ. అయితే.. కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దసరా కావడంతో స్వగ్రామం కృత్తివెన్నుకు వచ్చారు. గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేసే అలవాటు ఆయనకు ఉంది. కృత్తివెన్ను పీతలావ గ్రామస్థులు కొండూరు నాగబాబు శర్మను శనివారం మధ్యాహ్నం పిలిచారు. వాళ్ల విజ్ఞప్తి మేరకు పామును పట్టుకున్నారు నాగబాబు శర్మ. ఎప్పట్లాగే ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసే ప్రయత్నంలో ఉండగానే పాము కాటు వేసింది. అతని చేతిపై కాటు వేసింది.


పాము కాటువేసినా ఆయన పామును మాత్రం వదల్లేదు. దాన్ని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టేశారు. తర్వాత ఇంటికి వచ్చిన తనను పాము కాటు వేసిన చోట ప్రథమ చికిత్స తీసుకున్నారు. కానీ కొంతసేపటికే పరిస్థితి విషమించింది. సమీపంలోని చినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నాగబాబు శర్మను పరీక్షంచి పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వారు చెప్పారు. నాగబాబు శర్మ కుటుంబ సభ్యులు ఆయనను సొంత కారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాగబాబు శర్మకు వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. కానీ వైద్యం చేస్తుండగానే కొండూరి నాగబాబు శర్మ ప్రాణాలు కోల్పోయారు. 


ఎంతో మందిని పాము కాటు బారి నుంచచి రక్షించిన పురోహితుడు కొండూరి నాగబాబు శర్మ అలా పాము కాటులో ప్రాణాలు కోల్పోవడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగబాబు శర్మ మరణంతో కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం స్థానికులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబు శర్మ మృతదేహానికి నివాళి అర్పించారు. పగటి సమయంలో గుడిదిబ్బ గ్రామంలోనే నాగబాబు శర్మకు అంత్యక్రియలు నిర్వహించారు. కొండూరి నాగబాబు శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.