లివ్-ఇన్ రిలేషన్స్‌, సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో ఒక క్రమబద్ధమైన రూపకల్పనలా పని చేస్తోందని వ్యాఖ్యానించింది. లివ్ ఇన్ పార్టనర్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థ వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వం.. లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఇది ఉండదని జస్టిస్ సిద్దార్థ్‌‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. 


ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. ‘ప్రతిసారీ భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన. స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి ముఖ్య లక్షణంగా పరిగణింపబడదు’ అని స్పష్టం చేసింది. దేశంలో మధ్యతరగతి నైతికతను విస్మరించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో లివ్-ఇన్-రిలేషన్‌షిప్ సాధారణమైనదిగా పరిగణిస్తున్నారని అభిప్రాయపడంది.


వివాహ వ్యవస్థను పాతబడిందిగా భావిస్తున్నారని, అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వివాహ వ్యవస్థను రక్షించడం వారికి పెద్ద సమస్యగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. వివాహ బంధంపై భాగస్వామికి అవిశ్వాసం, సహజీవనంలో స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింంది. యువత అటువంటి ధోరణికి ఆకర్షితులతూ దీర్ఘకాలిక పరిణామాల గురించి పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. 


కేసు ఏంటంటే...
ఉత్తర్ ప్రదేశ్‌‌లోని షహనారాన్‌పూర్‌కు చెందిన అద్నాన్ అనే యువకుడు, 19 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని అద్నాన్ ప్రియురాలికి మాటిచ్చాడు. ఏడాది పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. తరువాత అద్నాన్ ఆమెను పెళ్లిచేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో బాధిత యువతి ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. తప్పుడు మాటలు చెప్పి కోరికను తీర్చుకున్నాడని పేర్కొంది. యువతి ఫిర్యాదు ఆధారంగా అద్నాన్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లగా దానిని న్యాయస్థానం తిరష్కరించింది. దీంతో అద్నాన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సిద్ధార్థ్ ధర్మాసనం సహజీవనాలపై అసహనం వ్యక్తం చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని అభిప్రాయపడింది.


గతంలోనూ హైకోర్టు ఆగ్రహం
గతంలో ఇలాంటి చాలా కేసుల్లో అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  18 ఏళ్ల లోపు ఉన్న వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక్కరైనా మైనర్ ఉంటే అది అనైతికమని వెల్లడించింది. ఓ మైనర్.. మేజర్‌తో సహజీవనం చేస్తూ.. చట్టం నుంచి రక్షణ పొందలేరని వ్యాఖ్యానించింది. వారు చేసే పని చట్టపరమైంది కాదని జస్టిస్ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 


లైంగిక అనుభవం ఉన్న పెళ్లైన మహిళ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, పురుషుడితో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఏకాభిప్రాయం లేనిదని భావించలేమని పేర్కొంది. 40 ఏళ్ల వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.