Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
Karnataka CM Siddaramaiah | పిల్లలపై మొబైల్ వాడకం పెరుగుతున్న ప్రతికూల ప్రభావాలను నిరోధించేందుకే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Karnataka Budget 2026 | 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం (మార్చి 6న) రాష్ట్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. మొబైల్ వినియోగంతో పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
గత నెలలో రాజధాని బెంగళూరులో జరిగిన వైస్ ఛాన్సలర్ల (వీసీల) సమావేశంలో సిద్ధరామయ్య ఈ అంశంపై చర్చించి, వారి అభిప్రాయాలను కోరారు. ఆ చర్చల సందర్భంగా మొబైల్ వ్యసనం (Mobile addiction), ఆన్లైన్ గేమింగ్ (Online Gaming), పిల్లల ఎడ్యుకేషన్, శారీరక దృఢత్వంపై సోషల్ మీడియా చూపుతున్న చెడు ప్రభావంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో సోషల్ మీడియాకు టీనేజర్లు మరింతగా అడిక్ట్ అవుతున్నారని, వారి మానసిక పరిస్థితిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారిలో నేర ప్రవృత్తి పెరగడం, పెద్దల మాట వినకపోవడం, చదువుపై సైతం ఫోకస్ చేయకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సిద్దరామయ్య ప్రస్తావించారు.
యువతలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి కొన్ని చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని కర్ణాటక ఐటీ, బీటీ (IT & BT) శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే జనవరి 30న అసెంబ్లీలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ.. పిల్లలు, టీనేజర్లు మొబైల్ విపరీతంగా వాడటం తీవ్రమైన అంశమని అన్నారు. ఫిన్లాండ్ ఇప్పటికే ఇటువంటి చర్యలు తీసుకుందని, యునైటెడ్ కింగ్డమ్ (UK) కూడా ఇదే విధమైన చర్యను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే కొన్ని వయస్సుల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిందని ఖర్గే గుర్తు చేశారు. సోషల్ మీడియా మితిమీరిన వాడకాన్ని నివారించడానికి ఏమి చేయవచ్చనే అంశంపై తాము కూడా సంబంధిత వర్గాలతో (స్టేక్ హోల్డర్స్) చర్చలు ప్రారంభించామని మల్లికార్జున ఖర్గే కొన్ని రోజుల కిందట అన్నారు.
తక్కువ వయస్సు గల వినియోగదారుల కోసం సోషల్ మీడియా యాక్సెస్ను పరిమితం చేయడానికి ఆస్ట్రేలియా కఠినమైన చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్, స్పెయిన్తో సహా ఐరోపాలోని మరికొన్ని దేశాల్లో కూడా పాఠశాలల్లో తరగతుల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను పెంచడానికి, పరధ్యానంగా ఉండటాన్ని నియంత్రించేందుకు స్కూల్లో స్మార్ట్ఫోన్ వినియోగంపై కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు























