ISRO Scientists Resign:ఇస్రో చాలా ప్రయోగాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది. అయితే అలాంటి సంస్థలో ఇప్పుడు కలవరం రేగింది. ఈ మధ్య కాలంలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. వీరంతా ఏ కేటగిరికి చెందిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇస్రోను కలవరపెడుతోంది. గగన్‌యాన్ వంటి కీలక ప్రాజెక్టులు భుజానికి ఎత్తుకున్న వేళ కీలకమైన శాస్త్రవేత్తలు సంస్థను విడిచిపెట్టేస్తున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 

Continues below advertisement

కేంద్రం విడుదల చేసిన కొత్త రూల్స్ ఏంటీ?

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం ఇవాళ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కీలకమైన ప్రాజెక్టుల్లో భాగమైన ఇస్రోలోని వ్యక్తులు తమకు తాము తప్పుకోవడానికి లేదని స్పష్టం చేసింది. ఇదో సాధారణ ప్రక్రియగా చూడటానికి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు డైరక్టర్లు తమ విభాగంలోని సిబ్బంది, శాస్త్రవేత్తల రాజీనామాలను వారు ఆమోదించేవారు. 2020 తర్వాత ఈ రూల్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు భారీ సంఖ్యలో శాస్త్రవేత్తలు తప్పుకోవడంతో రాజీనామాల ఆమోదాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. 

ఇప్పుడు శాస్త్రవేత్తల రాజీనామాలు ఎవరు ఆమోదిస్తారు?

కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ కీలకమైన ప్రాజెక్టుల్లో భాగమైన శాస్త్రవేత్తలు కానీ, టెక్నికల్ సిబ్బందికి వర్తిస్తాయి. ఈ పరిధిలోకి వచ్చే వారి రాజీనామా లేఖలను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ వారు పరిశీలించి ఓకే చెబితేనే రాజీనామా ఆమోదం పొందుతుంది.  బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (URSC), తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లోనే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు తప్పుకుంటున్నట్టు నివేదికలు ఉన్నాయి. ఈ కేంద్రాలతోపాటు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC), లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC)తోపాటు ఇతర కేంద్రాల్లో కూడా ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. 

Continues below advertisement

భారత్‌ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్‌యాన్‌తో సిద్దమవుతోంది. ఈ మిషన్ కీలక దశలో ఉన్నప్పుడు జరుగుతున్న రాజీనామాలు కేంద్రానికి చికాకు కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన ఎల్‌వీఎం3 లాంచ్ వెహికల్‌ ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్‌ టి వంటి సీనియర్‌ శాస్త్రవేత్తలు కూడా సంస్థను వీడుతున్నారు. ఇలాంటి కీలకమైన వ్యక్తులు వెళ్లిపోవడంతో సంస్థకు భారీ షాకింగ్‌గానే ఉంది. 

శాస్త్రవేత్తలు ఎందుకు వెళ్లిపోతున్నారు?

భారత్‌లో అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్టుగానే స్పేస్‌ సెక్టార్‌లో కూడా విపరీతమైన పోటీ ఉంది. ఇక్కడ కూడా 2020 నుంచి ప్రైవేటు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. 2023లో తీసుకొచ్చిన భారత్ అంతరిక్ష పాలసీతో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. అందుకే అక్కడ ఇస్రో మాజీ శాస్త్రవేత్తలకు భారీ డిమాండ్ ఉంది. 

ప్రస్తుతం భారత్‌ 400కుపైగా ప్రైవేటు స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. వాటిపై భారీగా ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నారు. గత ఏడాది 150 మిలియన్లకుపైగా డాలర్ల పెట్టుబడులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్, ధ్రువ స్పేస్, అగ్నికుల్ కాస్మోస్ వంటి సంస్థలు ఎక్స్‌పీరియన్స్ సైంటిస్టుల కోసం అన్వేషిస్తున్నారు. వారికి భారీగా ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. అందుకే అలాంటి వారంతా ఇస్రోను వదిలేసి ప్రైవేటు స్టార్టప్‌లలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇలా ప్రైవేట్ స్టార్టప్‌ల స్పీడ్‌ ఇస్రోను తాకింది. కీలకమైన స్థానాల్లో ఉన్న వారంతా బయటకు వచ్చేసి స్టార్టప్‌లలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఒక విధంగా ఇస్రోకు, కేంద్రానికి సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం ఇస్లో గగన్‌యాన్, చంద్రయాన్-4, మంగళయాన్-2 వంటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇలాంటి తరుణంలో శాస్త్రవేత్తల నిష్క్రమణ మాత్రం బిగ్ షాక్ అనే చెప్పాలి.