Indian Seafarers Killed Oman:నీలి సముద్రం రక్తసిక్తమవుతోంది. పశ్చిమ ఆసియాలో రగులుతున్న ఉద్రిక్తతలు సామాన్య నావికుల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై జరిగిన దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో, ఒమన్ తీరంలోని షినాస్ పోర్డు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో భారతీయ నావికులు లక్ష్యంగా దాడులు జరిగాయి. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై ఒమన్ గల్ఫ్ గుండా వెళ్తుండగా దాడి జరిగింది ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. వారిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండో దాడి ఎంటీ జల్వీస్ నౌకపై జరిగింది. షినాస్ పోర్టు సమీపంలో ఈ నౌకపై దాడి జరిగింది. దీని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో నౌక సముద్రం మధ్యలో తగలబడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 20 మంది భారతీయులు ఉన్నారు.
ఈ దాడులు జూన్ 10-11 తేదీల్లో జరిగాయి. బుధవారం జరిగిన దాడిలో ప్రాణనష్టం జరిగింది. గురువారం జరిగిన ఘటనలో నౌక మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల ఫలితంగా భారత్కు చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పార్వర్డ్ సీమెన్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. వారు చెప్పిన వివరాలు పరిశీలిస్తే, ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు నావికులు ఈ దుర్ఘటనలో మరణించారు. మొత్తం 24 మంది సిబ్బందిలో 21 మందిని సురక్షితంగా రక్షించారు. ముగ్గురు గల్లంతయ్యారు. తర్వాత వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికి తీశారు. ఇంకో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేయడానికి అమెరికా చేపట్టిన చర్యల ఫలితంగానే ఇది జరిగి ఉండవచ్చని, బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఎంప్రేర్ను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. దాడి జరిగే పక్షంలో, సిబ్బందిని ఓడ వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉండాలని గతంలోనే హెచ్చరించారు.
మూడు రోజుల్లో మూడు నౌకలపై దాడి
MT జల్వీర్పై దాడికి ముందు, గత రెండు రోజులుగా ఒమన్ తీరప్రాంతంపై దాడులు జరుగుతుండగా, నౌకపై ఇది వరుసగా మూడో దాడి. బుధవారం, సెటెబెలో ట్యాంకర్పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నిరసన తెలియజేయడానికి భారత్, అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించింది.
భారత్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు, అమెరికా చార్జ్ డి అఫైర్స్ జాసన్ మిక్స్ను పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేశారు. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
