Rare Earth: భారత్, రష్యాల అరుదైన ఒప్పందం.. ఇక చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతుందా?
India Russia rare earth partnership 2025: స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దేశంలో అరుదైన భూ ఖనిజాల అన్వేషణ కోసం రష్యాతో ఒప్పందం చేసుకుని చైనాకు చెక్ పెట్టనుంది.

India Russia Rare Earth Partnership: ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. అది చైనాతో భారత్ మధ్య మరో వివాదానికి బీజం పడేలా ఉంది. చైనా అరుదైన భూమి లోహాలు, శాశ్వత అయస్కాంతాల సరఫరాపై నియంత్రణ పెంచింది. భారత్ తన అవసరాలలో దాదాపు 65 శాతం అరుదైన భూమి లోహాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే భారత్ పొరుగుదేశం చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఈ సమయంలో ఒక ఊరట కలిగించే విషయం. ఈ సమస్యకు పరిష్కారం కోసం భారత కంపెనీలు రష్యాతో కలిసి దేశంలో అరుదైన భూ ఖనిజాల కోసం అన్వేషణ ప్రారంభించనున్నాయి.
ఈటీ నివేదిక ప్రకారం.. భారత్, రష్యా దేశాల మధ్య Rare Earth ఒప్పందం కుదరనుంది. దీనిపై ఇదివరకే ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్త దిశగా వేగంగా అడుగులు వేయాలని చూస్తోంది. విదేశీ దిగుమతులకు ప్రత్యామ్నాయాలను వెతకడానికి చర్యలు చేపట్టింది. ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత్ దాదాపు 2270 టన్నుల అరుదైన భూమి లోహాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది.
రష్యాలో ఏ కంపెనీలతో సంప్రదింపులు
కేంద్ర ప్రభుత్వం రష్యాతో చర్చల కోసం లోహాలు, మిడ్వెస్ట్ కంపెనీలను ఎంచుకుంది. 2 కంపెనీలు రష్యా ఖనిజ సంబంధిత కంపెనీలతో కలిసి భారత్కు కొత్త అవకాశాలను అన్వేషించనున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ధన్బాద్), ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (భువనేశ్వర్) లను రష్యా కంపెనీల సాంకేతికతలను అర్థం చేసుకోవడానికి, అరుదైన లోహాల ప్రాసెసింగ్ సమాచారాన్ని సేకరించడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. రష్యా నుంచి నార్నికెల్, రోసాటమ్ కంపెనీలు భారత్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇవి రెండూ రష్యా ప్రభుత్వ కంపెనీలు కావడంతో అరుదైన లోహాల దిగుమతి సమస్యకు త్వరలోనే భారత్ చెక్ పెట్టనుంది.
గేమ్ ఛేంజర్లుగా భారత్, రష్యా
ప్రస్తుతం చైనా ప్రపంచ మార్కెట్లో దాదాపు 90 శాతం అరుదైన భూమి ప్రాసెసింగ్తో ఆధిపత్యం చెలాయిస్తోంది. అమెరికాకు సైతం చైనా అరుదైన లోహాలను ఎగుమతి చేస్తుంది. దాదాపు ప్రపంచమంతా చైనానే అరుదైన భూ ఖనిజాలు, లోహాలను ఎగుమతి చేస్తుంది. మీడియా నివేదికల ప్రకారం.. రష్యా గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన భూమి ప్రాసెసింగ్ సాంకేతికతలో అభివృద్ధి సాధించింది. రష్యా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే.. ఈ సాంకేతికతలను వాణిజ్యపరంగా భారత్ కు అందించనుంది. ఇది కార్యరూపం దాల్చితే, భారత్, రష్యా అరుదైన భూమి ప్రాసెసింగ్ ప్రపంచంలో గేమ్ ఛేంజర్లుగా మారతాయి. ఇది చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియాలో మరో అడుగు ముందుకు వేస్తుంది. భారత్ నుంచి విదేశాలకు అరుదైన లోహాల ఎగుమతికి అవకాశాలు లభిస్తాయి.
అరుదైన భూ ఖనిజాలు, లోహాలు, శాశ్వత అయస్కాంతాల (REPM) ఉత్పత్తి కోసం భారత ప్రభుత్వం ఇటీవల రూ. 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించడంపై చర్యలు చేపట్టింది. భారతదేశంలో అరుదైన భూ ఖనిజాలు, లోహాల ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.






















