న్యూఢిల్లీ: ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల వేళ, భారత ప్రభుత్వం తన పౌరులు ఇరాన్ వదిలి వెళ్లాలని మరో సలహా జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అడ్వైజరీలో ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులను వీలైనంత త్వరగా ఇరాన్ నుండి బయలుదేరాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్‌కు ప్రయాణాలు చేయవద్దని సూచించింది. గత 10 రోజుల్లో ఇరాన్ గురించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రెండవ అడ్వైజరీ నోట్ ఇది.

భారత పౌరులు ఇరాన్ వదిలి వెళ్ళాలి: విదేశాంగ మంత్రిత్వ శాఖ

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది. 'ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిరసనలు లేదా ర్యాలీలు జరిగే ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండాలి. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలి. ఏదైనా తాజా సమాచారం కోసం స్థానిక మీడియాను గమనించాలి. వార్తలు తెలుసుకోవాలని’ సూచించింది. భారత పౌరులను వాణిజ్య విమానాలు, అక్కడ అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాల ద్వారా ఇరాన్ వదిలి వెళ్లాలని సలహా ఇచ్చారు.

భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లు విడుదల 

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను, పాస్‌పోర్ట్‌లు, IDలతో సహా సిద్ధంగా ఉంచుకోవాలని కోరింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపుల హెల్ప్‌లైన్ నంబర్‌లను +989128109115; +989128109109; +989128109102; +989932179359 సంప్రదించాలని సూచించింది. ఏదైనా అవసరం అయితే ఈమెయిల్ cons.tehrana mea.gov.in ద్వారా సంప్రదించాలని సూచించింది. 

భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవడానికి లింక్ విడుదల 

విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. 'ఇరాన్‌లో ఉన్న, భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని భారతీయులు (https://www.meaers.com/request/home) లింక్‌ను సందర్శించి నమోదు చేసుకోవాలి. ఈ లింక్ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటం వల్ల ఏ భారతీయుడైనా నమోదు చేసుకోలేకపోతే, దేశంలోని వారి కుటుంబ సభ్యులు నమోదు చేసుకోవాలని' సూచించారు. 

ఇరాన్‌లో పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్న సమయంలో, అమెరికా దేశం ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని బెదిరిస్తున్న సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సలహా జారీ చేసింది. జనవరి 13న ఒక రోజు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను నిరసనలు కొనసాగించాలని సూచించారు. 'సహాయం మార్గంలో ఉంది' అంటే ఏమిటో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయలేదు. ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ ప్రజలకు సాయం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, 'ఇరాన్ దేశభక్తులు నిరసనలు కొనసాగించాలి. మీ ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి. హంతకులు, నియంతల పేర్లను భద్రపరచండి. వారు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నిరసనకారులను అకారణంగా చంపడం ఆగిపోయే వరకు నేను ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేశాను. దేశ ప్రజలకు సహాయం మార్గంలో ఉంది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.