Independence Day 2023: ప్రపంచం దృష్టిలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు భారత్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దౌత్యపరంగా, ఆర్థికంగా, అంతరిక్ష పరిశోధనల్లోనూ అభివృద్ధి చెందిన దేశాలను వెనక్కి నెట్టేలా ముందుకు దూసుకెళ్తోంది భారత్. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ స్థానం ఐదు. యూకే, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ లాంటి దేశాల కంటే భారత్ ముందుంది. అయినా భారత్ సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. రాబోయే 10 ఏళ్లలో భారత్ అందుకోవాల్సిన లక్ష్యాలు, చేరాల్సిన గమ్యస్థానాలు ఏంటో, భారత్ కు ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


దేశ ప్రధాన సంపదగా యువత


జనాభాలో భారత్ చైనాను దాటేసింది. 2030 నాటికి భారత జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే భారత్ కు ప్లస్ కానుంది. ఇందులో అత్యధిక మంది యువకులే ఉండటం వల్ల ఆ యువ శక్తితో భారత్ ప్రపంచ శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వస్తు తయారీ, సేవల ఉత్పత్తికి ఈ యువ జనాభాను భారత్ పగడ్భందీగా వాడుకోనుంది. 


మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు


యువ జనాభా, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థు ఉపయోగించుకునేందుకు భారత్ తన మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు నిర్మిస్తోంది. ఈ మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల భారతీయ వ్యాపారాలు ఇతర దేశాలకు వస్తువులను, సేవలను ఎగుమతి చేయడం సులభతరం చేస్తుంది. 


విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానం


భారత్ విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోంది. 2022లో భారత్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 80 బిలియన్ డాలర్లకు చేరాయి. భారతదేశ చరిత్రలో ఇదే అత్యధిక ఎఫ్‌డీఐ. అంతర్జాతీయ పరిణామాలు కూడా భారత్ కు అనుకూలంగానే ఉన్నాయి. ఈ పెట్టుబడుల వల్ల భారత్ లో తయారీ రంగం మరింతగా విస్తరించనుంది. ఉద్యోగాల సృష్టితో ఉపాధి కల్పన పెరగనుంది. 


విదేశాల్లో భారతీయ కంపెనీల పెట్టుబడులు


భారతీయ కంపెనీలు విదేశాల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయి. 2022లో భారతీయ కంపెనీలు విదేశీ సంస్థల్లో 60 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ ట్రెండ్ వచ్చే 10 ఏళ్లలో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ కంపెనీలు తమ పరిధిని విస్తరించుకునే ఉద్దేశంతో ఇతర దేశాల్లో ఆస్తులను, సాంకేతికతను పొందాలని చూస్తున్నాయి.


Also Read: Indias Population: రాబోయే 10 ఏళ్లలో భారత్‌ జనాభా పరిస్థితి ఎలా ఉండనుంది? ప్రభుత్వాలు ఏం చేయనున్నాయి?


ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్ లో ప్రధాన ఎగుమతిదారు


భారత్ ఇప్పటికే ఐటీ సేవలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్ లో ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. వచ్చే 10 ఏళ్లలో ఈ రంగాలు మరింతగా వృద్ధిచెందుతాయని అంచనా. భారత్ కూడా ఆటోమొబైల్స్, ఆహార ఉత్పత్తులు, రసాయనాలు వంటి ఇతర వస్తువులు, సేవల ప్రధాన ఎగుమతిదారుగా మారుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


రాబోయే 10 ఏళ్లలో భారత్ ఒక ప్రధాన గ్లోబల్ ప్లేయర్ గా మారడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దేశంలో వనరులు, ప్రతిభ, మ్యాన్ పవర్ పుష్కలంగా ఉన్నాయి. యువ జనాభా, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన శక్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. భారత్ లో మధ్యతరగతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది వినియోగ వస్తువులు, సేవలకు పెద్ద మార్కెట్ ను సృష్టిస్తోంది. సాంకేతిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా భారత్ ఉంది. ఏఐ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారత కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశం గొప్ప, విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉండటం వల్ల విదేశీ పర్యాటకులను, వ్యాపారులను విశేషంగా ఆకర్షిస్తోంది.