Haryana Clashes:



నిఘా వైఫల్యం..?


హరియాణాలో అల్లర్లు జరగడానికి నిఘా వర్గాల వైఫల్యమే కారణమా..? ప్రస్తుతానికి దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రంకోర్టు వరకూ వెళ్లింది. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు CCTVలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే...ఇది కేవలం ఇంటిలిజెన్స్ వైఫల్యమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఇంటిలిజెన్స్ అధికారులు మాత్రం తాము ముందుగానే దీనిపై హెచ్చరికలు చేశామని తేల్చి చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న వాదనా వినిపిస్తోంది. ముస్లింలు ఇంతగా దాడులు చేయడానికి కారణం...విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన యాత్ర. ఆ యాత్రను లీడ్ చేసిన మోను మనేసర్...గతంలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇదే వ్యక్తి అక్కడ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నిర్వహించాడు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు దాడులు చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం...వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2,500 మంది ఆందోళనకారులు ఆలయంపై దాడి చేశారు. అక్కడి షాప్‌లను ధ్వంసం చేశారు. 


ప్రతిపక్షాల విమర్శలు..


పోలీసులు చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి ఆందోళనల తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఒకేసారి 700 మంది పోలీసులను పంపింది. అయితే..వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల కొంత మంది పారిపోయి వచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరో కీలక విషయం ఏంటంటే..మేవట్ ఎస్‌పీ సెలవులో ఉన్నప్పుడే ఇది జరగడం. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అల్లర్లపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INDL) నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటివి జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండి పడుతున్నాయి. అల్లర్లు జరుగుతాయని హెచ్చరించినా కేవలం హోంగార్డులను పంపి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ రెండు వర్గాలకు చెందిన కొందరు సవాళ్లు విసురుకున్నారని తెలుస్తోంది. ఇవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన అల్లర్లే అని విపక్షాలు తేల్చి చెబుతున్నాయి. 


116 మంది అరెస్ట్..


ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 116 మందిని అరెస్ట్ చేశారు. 41 FIRలు నమోదయ్యాయి. ఈ ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో ఇద్దరు హోంగార్డ్‌లతో పాటు ముగ్గురు సాధారణ పౌరులు, ఓ ఇమామ్ ఉన్నారు. హరియాణాలో గొడవ సద్దుమణగకముందే అటు గుడ్‌గావ్‌లోనూ ఇదే తరహా కలహాలు మొదలయ్యాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. NCR ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. పలు చోట్ల విద్యాసంస్థలు బంద్ చేశారు. ఈ అల్లర్లపై నిరసనగా VHP మేవట్‌లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీతో పాటు బజ్‌రంగ్ దళ్ మహా పంచాయత్‌ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. రెండు రోజులుగా హరియాణాలో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి...అందరికీ భద్రత ఇవ్వలేముగా అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 


Also Read: PM Modi: ముస్లిం మహిళలతో రాఖీ జరుపుకోండి- ఎంపీలకు ప్రధాని మోదీ సూచన