G20 Summit 2023: భారత్ సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే సమ్మిట్‌కు ప్రపంచ స్థాయి నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. అందు కోసం ఢిల్లీలోని హోటళ్లు ప్రత్యేకమైన రీతిలో VVIP లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు.



అత్యంత ఆకర్షణీయమైన, అందమైన పాత్రలను ఐకానిక్ ITC తాజ్‌ హోటల్‌తో సహా 11 హోటళ్లకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం క్రోకరీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భగా పాత్రల తయారీ సంస్థ యజమానులు రాజీవ్, అతని కుమారుడు మాట్లాడుతూ.. తాము మూడు తరాలుగా ఈ పాత్రలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. విదేశీ సందర్శకులకు తమ డైనింగ్ టేబుల్‌లపై భారతదేశ రుచిని అందించడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఈ పాత్రలు జైపూర్, ఉదయపూర్, వారణాసి, కర్నాటకలో కళాత్మకంగా రూపొందించినట్లు చెప్పారు. 



ఇవి భారతదేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ పాత్రలపై మేక్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇవి దేశంలోని హస్తకళకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఐరిస్ కంపెనీ ప్రకారం, జీ20 సమ్మిట్ కోసం 11 హోటళ్లకు ప్రత్యేకమైన పాత్రలను పంపుతున్నారు. ఈ పాత్రలు తయారైన తరువాత ప్రతి భాగం R&D ల్యాబ్‌లో క్షుణ్ణంగా పరీక్షించారు. హోటళ్ల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఈ పాత్రలు రూపొందించబడ్డాయి. 'మహారాజా తాలీ' తరహాలో ఉప్పు, పెప్పర్ కోసం ప్రత్యేక వెండి గిన్నెలు, అన్నీ హోటల్ మెనూ, శైలికి సరిపోయేలా 5-6 గిన్నెలను కలిగి ఉండేలా పాత్రల సెట్లు రూపొందించబడ్డాయి.


ఈ పాత్రల సెట్లు భారతదేశం గొప్ప వారసత్వానికి ప్రతీకగా  నిలవనున్నాయి. జాతీయ పక్షి నెమలిని కూడా కంపెనీ తన డిజైన్‌లో చేర్చింది. ఇది తరచుగా అతిథుల నుంచి ప్రశంసలను పొందుతుంది. మహారాజా తాలీతో పాటు, దక్షిణ భారతదేశానికి చెందిన డిజైన్‌లను కూడా సేకరణలో పొందుపరిచారు. వివిధ హోటళ్లు వారి ప్రత్యేకమైన మెనుల ఆధారంగా తమ పాత్రల డిజైన్‌లను రూపొందించారు. ఇలా ప్రత్యేకంగా తయారు చేయడానికి చాల సమయం పడుతుందని తయారీదారులు తెలిపారు. 


పాత్రల కంపెనీ యజమాని రాజీవ్ మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశాన్ని సందర్శించినప్పుడు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ తయారు చేసిన పాత్రలు ఒబామాను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. వాటిలో కొన్నింటిని ఒబాబా తనతో తీసుకెళ్లినట్లు చెప్పారు. 


ప్రపంచదేశాల అధినేతలకు విందు
జీ-20 సదస్సుకు హాజరు కాబోతున్న వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర నేతల సతీమణులకు ప్రత్యేక విందు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని జైపుర్‌ హౌస్‌లో స్పెషల్‌గా మధ్యాహ్న విందు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈక్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెనూలో చిరు ధాన్యాల ఆహార పదార్థాలను కూడా చేర్చారు. 


నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఏ)కు కేంద్రమైన జైపుర్‌ హౌస్‌లో ప్రత్యేక పెయింటింగ్స్‌, పేరొందిన శిల్పాలు, అద్భుతమైన ఫొటోలతో పాటు అనేక రకాల కళాకృతులు ఉన్నాయి. జైపుర్‌ మహారాజు కోసం ఈ భవనాన్ని 1936లో నిర్మించారు. పుసా-ఐఏఆర్‌ఐ క్యాంపస్‌లో జీ-20 సదస్సుకు హాజరు కాబోతున్న ప్రముఖ మహిళల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. చిరు ధాన్యాలతో ఆహార పదార్థాలతోపాటు  అద్భుతమైన, రుచికరమైన పాకశాస్త్ర ప్రవీణులు స్టార్టర్‌లను కూడా వాటితో తయారు చేస్తున్నారు.