Ayodhya: అయోధ్యలో రామమందిరానకి భక్తుల తాకిడి భారీగా పెరగడంతో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు  కీలక నిర్ణయం తీసుకుంది. బాలరాముడి దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా...ఇకపై ఉదయం 6 గంటలకే బాలరాముడిని దర్శించుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు భక్తులను  దర్శనానికి అనుమతించనున్నారు.
 
అయోధ్య ఆలయం
ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్య(Ayodhya)కు మళ్లీ రాముడు తిరిగొచ్చాడు. హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి ప్రతి ఊరిలో గుడి (Temple) ఉన్నా...ఆయన ఏలిన రాజ్యం, సొంత ఊరులో మాత్రం ఆ బాలరాముడికి కోవెల లేదన్న చింత ప్రతి హిందూవులోనూ ఉంది. ఐదు వందలఏళ్ల క్రితమే అయోధ్యలో రామమందిరాన్ని కూల్చివేసి ముస్లిం రాజులు అక్కడ మసీదు నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ తిరిగి రామమందిరం నిర్మించాలని ప్రతి హింధువుల సంకల్పం. బాబ్రీ మసీదు కూల్చివేత  అనంతరం దశాబ్దాల  తరబడి రాజకీయ, న్యాయపోరాటాల అనంతరం...అక్కడ రామమందిరం(Rammandhir) ఆనవాళ్లు ఉన్నాయని, వాటి పునాదులపైన మసీదు నిర్మించారని 2019లో  సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరిగి అక్కడ రామమందిరం  నిర్మించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అనుమతించింది.
అయోధ్యలోనే మరోచోట మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నో ఏళ్లనాటి హిందువుల కల ఫలించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుమారు  11 వందల కోట్లతో అత్యద్భుతమైన  ఆలయ నిర్మాణ పనులు చేపట్టింది. 2020 ఆగస్టు 5న  ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనం చేసి.. 2024లో పూర్తి చేశారు. గతేడాది జనవరి 22న  ఈ భవ్య రామమందిరంలో  బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రధాని మోడీ(Narendra Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా  నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలిరోజే  దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయంలో దేవుడిని దర్శించుకున్నారు.  ఆ తర్వాత  రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాలరాముడిని దర్శనానికి అనుమతిస్తున్నారు. 
 
దర్శన వేళల్లో మార్పులు
దాదాపు రెండున్నర ఎకరాల్లో అత్యద్భుతమైన నగరశైలిలో  ఐదు  అంతస్తులుగా నిర్మించిన  అయోధ్య రామమందిరం  ఆధ్యాత్మికంగానే గాక...పర్యాటకంగానూ ఎంతో  పేరు తెచ్చుకుంది. వందల ఏళ్ల తర్వాత తిరిగి అయోధ్య చేరుకున్న రాములోరిని కళ్లారా చూడాలని దేశంలోని హిందూవులంతా అనుకుంటున్నారు. దీంతో  ఒక్కసారిగా  అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. పైగా మహాకుంభమేళాకు  వెళ్లిన ఇతర  రాష్ట్రాల భక్తులు సైతం....అయోధ్య రామయ్యను దర్శించుకుని వస్తున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులు పోటెత్తుతున్నారు. వస్తున్న భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించడం ట్రస్టుకు  ఇబ్బందిగా మారింది. దీంతో దర్శన వేళల్లో స్పల్ప మార్పులు  చేశారు.ఇప్పటి వరకు ఉదయం 7గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా...ఇకపై ఉదయం 6 గంటల నుంచే దేవుడి గుడి తలుపులు తెరుచుకోనున్నాయి. అక్కడి నుంచి నిరంతరాయంగా  రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు.
 
తెల్లవారుజామున 4గంటలకే మంగళ హారతితో స్వామివారిని మేల్కొపుతారు. ఆ తర్వాత కాసేపు ద్వారాలు మూసివేస్తారు. భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారన్న సంకేతంగా  ఉదయం 6 గంటలకు శ్రింగార్ హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగి నైవేధ్యం సమర్పణ ఉంటుంది.ఆ సమయాల్లో మాత్రం భక్తులను అనుమతించరు. కానీ ఇకపై ఆయా సమయాల్లోనూ భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, సాయంత్రం 7గంటలకు సంధ్యా హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేసి తిరిగి భక్తుల దర్శనార్థం తెరుస్తారు. అలాగే, ప్రస్తుతం రాత్రి 9.30 గంటలకు ఇచ్చే శయన హారతిని ఇకపై రాత్రి 10 గంటలకు ఇవ్వనున్నారు.