Delhi Air Pollution:


మార్గదర్శకాలు..


నగరవ్యాప్తంగా కాలుష్యాన్ని (Delhi Air Pollution) దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పౌరులకు కీలక సూచనలు చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలూ జారీ చేసింది. కలిసికట్టుగా ఈ సవాలుని దాటాలని సూచించింది. ఢిల్లీ పౌరులు మార్నింగ్ వాక్‌ చేయడం మానేయాలని తేల్చి చెప్పింది. దీంతో పాటు వ్యాయామమూ కొన్నాళ్ల పాటు మానేస్తే మంచిదని తెలిపింది. హెల్త్ ఎమర్జెన్సీని (Delhi Health Emergency) ఎదుర్కొంటున్న సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. స్థానికంగా అన్ని న్యూస్‌ పేపర్లలోనూ ఈ మార్గదర్శకాలు ప్రింట్ చేయించింది ఢిల్లీ ఆరోగ్య శాఖ. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలుష్య ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. గర్భంతో ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడిన వాళ్లూ బయటకు రాకపోవడమే మంచిదని వివరించింది. 


"కాలుష్య ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఢిల్లీ పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొల్యూషన్ లెవెల్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగకుండా ఉండడం మంచిది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న చోటుకీ వెళ్లకండి. నిర్మాణాలు జరుగుతున్న, నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాలకూ వెళ్లకుండా ఉంటే చాలా వరకూ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు"


- ఢిల్లీ ఆరోగ్య శాఖ


పొగ తాగకండి..


పొగ తాగడాన్నీ కొన్ని రోజుల పాటు మానేయాలని సూచించింది ప్రభుత్వం. మస్కిటో కాయిల్స్‌ని కాల్చడాన్ని కొద్ది రోజుల పాటు అవాయిడ్ చేయాలని తెలిపింది. పంట వ్యర్థాలు, ఎండిన ఆకులను కాల్చకూడదని స్పష్టం చేసింది. కాలుష్యం కారణంగా చాలా మంది కళ్లమంటలతో బాధ పడుతున్నారు. దీనికీ కొన్ని సూచనలు చేసింది ప్రభుత్వం. తరచూ గోరువెచ్చని నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని చెప్పింది. 


"శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లండి. దగ్గు, ఛాతినొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమవండి. కొద్ది రోజుల పాటు కార్‌ పూలింగ్‌ విధానాన్ని ఫాలో అవండి. వీలైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగించుకోండి. ఇళ్లు ఊడ్వడం మానేసి మాప్‌లతో తడి పెట్టి తుడుచుకోండి. ఇలా చేయడం వల్ల దుమ్ము గాల్లో కలవకుండా ఉంటుంది"


- ఢిల్లీ ఆరోగ్య శాఖ


ప్రభుత్వం కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ లోగా వర్షం కురవడం వల్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికీ AQI "Poor" కేటగిరీలోనే ఉన్నప్పటికీ మునుపటితో పోల్చుకుంటే కొంత వరకూ ఊరట లభించింది. Central Pollution Control Board (CPCB) లెక్కల ప్రకారం...ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi AQI) 279గా నమోదైంది. వర్షం కారణంగానే గాలి నాణ్యత పెరిగిందని అధికారులు వెల్లడించారు. హాట్‌స్పాట్‌గా ఉన్న ఆనంద్ విహార్‌లో AQI 282గా నమోదైంది. RK పురంలో 220, పంజాబీ బాగ్‌లో 236,ITO ప్రాంతంలో 263గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ AQI 437 వరకూ ఉంది. అయితే... India Meteorological Department అంచనాల ఆధారంగా చూస్తే...ఇవాళ కూడా (నవంబర్ 11) వర్షం కురిసే అవకాశముంది. చాలా చోట్ల వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలున్నాయని IMD వివరించింది. ఢిల్లీలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందించారు. 


Also Read: Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం, వరుస ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు